Wednesday, October 25, 2023

శ్రీ జస్విందర్ ధని- కృష్ణ భక్తి గీతాలు


భక్తి గీతాలు మధురంగా, నెమ్మదిగా సాగుతూ శ్రోతలకు ప్రశాంతతను,  ఆనందాన్ని కలిగించేలా ...


పాటలో సాహిత్యం లలితమైన, అర్థవంతమైన పదములతో...


సంగీతం గానం మనసుకు హాయి గొలిపే విధంగా... 


ఉంటే బాగుంటుంది.


ఇటువంటి భక్తి గీతాల ఆల్బమ్ శ్రీ జస్విందర్ ధని గారు (10-11 సంవత్సరాల క్రితం) స్వరపరచి పాడారు. కృష్ణా శ్రీ కృష్ణా అనే పేరుతో ఉన్న ఆల్బమ్ లో మంచి భక్తి గీతాలు ఉన్నాయి.


గణేశ్ నవరాత్రులలో, శివరాత్రి, దసరా, ఉగాది .. పండుగల సందర్భంగా కొందరు ఔత్సాహికులు కొత్త గీతాలు స్వరపరచి పాడుతున్నారు. వారి ప్రయత్నం మంచిదే.  అయితే అధిక భాగం ఆ గీతాల్లో భక్తి భావం, ప్రశాంతత అంతగా అనిపించదు. వేగంగా పరుగులు తీసినట్లు పాడితే అది హృదయాన్ని చేరదు.


అలాగే శృతి విషయం లో మన వైపు గాయకులు హిందూస్థానీ గాయకుల లాగా కృషి చేయడం బాగుంటుంది.


జస్విందర్ గారి గాత్రం మధురం. తెలుగు మాతృ భాష కానందువల్ల పదముల ఉచ్చారణ లో కొంత వ్యత్యాసం ఉంది. అయినా ఈ పాటల మాధుర్యం, భక్తి భావం వలన ఆ విషయం అంతగా తెలియలేదు.


ఈ పాటల సాహిత్యం వెంపటి రాయంచ అనే రచయిత వ్రాసినట్లు తెలుస్తుంది. సాధారణ పదాలతో మంచి భావం అందించారు.


ఈ పాటలు భక్తి ఛానెల్స్ లో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి.


ఓ చక్రధారి ఓ వనమాలి 


ఆడి పాడే చూడు భలే మాయల వాడు


ఈ పాటలు వింటూ ఉంటే బృందావనంలో రాధా కృష్ణుల సన్నిధి లో ఉన్నట్లు ఆ సన్నివేశం ఎదురుగా జరిగినట్లు భావన కలుగుతుంది. ఈ పాటలు విన్న ప్రతిసారీ సాహిత్యం లో భక్తి భావం, శరణాగతి, ప్రేమ అనుభూతి కలిగిస్తాయి.

--------

ఆడి పాడే చూడు భలే మాయలవాడు

కృష్ణ గోవిందుడు రాధ తోడ ఆడే చూడు


మోవిని ముద్దుల దరహాసం వాడు

పింఛము తలపై తగిలించిన వాడు

భాగ్యశాలిగా ఆ వెదురు

స్వామి పెదవులపై పిల్లనగ్రోవై


చంద్రుని తేజం రాధారాణి

దీపపు కళిక ఆ మహరాణి

కంఠంలో ధరించే ఆ కృష్ణ హారము

నింగి చుక్కలైన బలాదూరెగా.


పావనమైనది రాధా ప్రేమ

జీవన వేణువు తానే కాదా

ప్రేమంటే అర్థం రాధే మరి

ఆ గోవిందుని చేరే మరి


ఆడి పాడే చూడు భలే మాయలవాడు

కృష్ణ గోవిందుడు రాధతోడ ఆడే చూడు


-------



Sunday, October 8, 2023

మధుర గాయని బి.రమణ గారు

గణేశ్ నవరాత్రుల ప్రసారం లో వినాయకా నీ మూర్తికే  మా మొదటి ప్రణామం అనే ఒక పాట వినిపించింది. ఆ వాయిస్ లో  ఉన్న మాధుర్యం, స్పష్టత, శృతి చూసి ఎవరు ఇంత బాగా పాడారు అని వెతికితే.

గాయని బి రమణ గారు అని తెలిసింది. ఆమె ఎవరో కాదు. 70 80 లలో వచ్చిన సినిమాలలో అనేక సినీ గీతాలు పాడిన సీనియర్ నేపథ్య గాయని బి.రమణ గారు అని తెలిసింది.


నాకు సుశీల గారి గాత్రం అంటే ప్రత్యేకమైన అభిమానం. 


అదే తీరుగా ఉన్న రమణ గారి గొంతులో మాధుర్యం, స్పష్టత, శృతి విని ఆశ్చర్య పడ్డాను. అలాంటి గోల్డెన్ వాయిస్ దేవుడిచ్చిన వరం. అతి కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది.


main stream గాయని గా అవకాశాలు వచ్చి ఉంటే రమణ గారికి ఎంతో పేరు వచ్చి ఉండేది. అయితే అదే సమయంలో మేరు సమానులైన  సుశీల గారు జానకి గారు పీక్స్ లో ఉన్నారు.  బహుశ : అంచేత రమణ గారికి చిన్న చిత్రాలలో, కాంబినేషన్ గీతాలు, డబ్బింగ్ సినిమా గీతాలు ఎక్కువగా లభించాయి. ఆమె లైమ్ లైట్ లోకి రాలేకపోయారు అనిపిస్తుంది.


అయితే ఆమె భక్తి గీతాలు విరివిగా పాడినట్లు తెలుస్తుంది. అందులో కొన్ని గీతాలు యూ ట్యూబ్ లో ఉన్నాయి.


మహిషాసుర మర్దిని స్తోత్రం - ఈ భక్తి గీతం ఎన్నోసార్లు విని సుశీల గారు పాడారు అనుకున్నాను ఇన్నాళ్లు. అయితే రమణ గారు పాడారు అని తెలిసి ఆశ్చర్యం కలిగింది. అంత బాగా పాడారు.


అన్నమయ్య కీర్తనలు. - చాలా చక్కగా పాడారు రమణ గారు. సాహిత్యం స్పష్టంగా అర్థమయ్యేలా ఉచ్చారణ, మధురమైన గాత్రం, మంచి శృతి. ఈ మూడు లక్షణాలు ఉన్న గాత్రం అరుదుగా ఉంటుంది.

ఇలాంటి గాత్రం ఉన్న గాయని ఇతర భాషలలో ఉంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉండేవి.


ముఖ్యంగా పై స్థాయి లో High pitch కూడా స్పష్టత లోపం లేకుండా పాడటం సామాన్యమైన విషయం కాదు. గురుతెరిగిన దొంగ గూ గూ గూ అనే అన్నమయ్య గీతం రమణ గారు పాడిన తీరు లో ఈ విషయం గమనించ వచ్చు


బి. రమణ గారి తో యజ్ఞ మూర్తి గారు చేసిన ఈ యూ ట్యూబ్ ఇంటర్వ్యూ లో అనేక విశేషాలు రమణ గారు పంచుకున్నారు.


బి. రమణ గారిని సముచిత రీతిలో ప్రభుత్వం వారు, సినీ పరిశ్రమ గుర్తించి సన్మానిస్తే బాగుంటుంది.