Friday, February 21, 2025

ధ్వని (1988 ) - సంగీత భరిత చిత్రం

(picture credits to the respective owners)


తిరుపతి శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు ముత్యపు పందిరి వాహనసేవ  SVBC వాహినిలో ప్రత్యక్ష ప్రసారం చూస్తుండగా ' జానకీ జానే ' అన్న ఒక మధుర గీతం జేసుదాసు గళంలో వినిపించింది. ఇంత మంచి గీతం ఇదివరకు వినలేదే అనుకుంటూ అంతర్జాలంలో వివరాలు సేకరించాను.


ఆ గీతం ' ధ్వని ' అనే మళయాళ చిత్రం లోనిది అని తెలిసింది. Serendipity అంటే ఇదేనేమో.  ధ్వని చిత్రం యొక్క సంగీత విశేషాలు తెలుసుకుందాము అని చూస్తే . అన్నీ మంచి పాటలే ఉన్నాయి. 

సంగీతం : Legendary  Hindustsni film music director Naushad Ali composed the songs. అన్ని పాటలు జేసుదాస్ గారు పాడారు. రెండు పాటలు సుశీల గారు పాడారు. అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. We are fortunate to be born in the same era of legends like Yesudas, Susheela Garu అని మరొకసారి అనిపించింది.



ఈ చిత్రంలో జయరామ్ , శోభన నాయికా నాయికలు.


జానకీ జానే అన్న గీతం యమన్ కళ్యాణ్ రాగం లో ఉంది. జేసుదాస్ గారు సుశీలగారు ఇద్దరు పాడిన రెండు వెర్షన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. Both the songs are melodious in their golden voices.


ఒక విశేషం ఏమిటంటే ఈ గీతం శ్రీ రామచంద్రుని స్తుతించే ఒక సంస్కృత గీతం. రచన యూసఫ్ ఆలీ కెచేరి, సంగీతం నౌషాద్, గానం జేసుదాసు సుశీల. 


A beautiful musical and lyrical collaboration by great artists of three religions.


' అనురాగ లోల ' అనేది మరొక చక్కటి యుగళ గీతం. జేసుదాస్, సుశీలమ్మ గారు అద్భుతంగా పాడారు. ఈ పాట పట్ దీప్ అనే హిందూస్తానీ రాగం ఆధారంగా స్వరపరిచారు. ఈ పట్ దీప్ రాగం కర్నాటక సంగీత రాగం గౌరిమనోహరి రాగానికి చాలా దగ్గరగా ఉంటుంది. దాదాపు అవే స్వరాలు కలిగి ఉంటుంది. పాట చాలా బాగా వచ్చింది. Short and sweet.


ఈ రాగంలో మేఘా ఛాయే ఆధీ రాత్ అన్న ప్రసిద్ధ గీతం ఉంది ( శర్మీలీ చిత్రం)


తక్కిన పాటలు కూడా శాస్త్రీయ రాగాల ఆధారంగా సరళంగా స్వరపరచబడి వినటానికి  హాయిగా ఉన్నాయి. 


' ధ్వని ' చిత్రం గీతాల juke Box 


మళయాళ సాహిత్యం లో సంస్కృత పదాల ప్రభావం తెలుగు కంటే కూడా ఎక్కువ. సినీ గీతాలలో కూడా సంస్కృత పదాలు విరివిగా ఉపయోగిస్తారు.  


అనురాగ లోల గాత్రి, నీల రాత్రి, లయ లాస్య కలా కాంతి, ద్యుతి నిన్ముఖారవిందం, ప్రాణ సఖి, రజనీ రాజ ముఖి, హిమ మణిమాల, మంజీర ధ్వని, మంజుల హాసం, మాధవ మాసం , భాసుర కావ్యం, నిర్వృతి.... ఇలా ప్రతి గీతం సంస్కృతపద భూయిష్టం గా సాగుతుంది.


ఇలాంటి మధుర సంగీతం, సాహిత్యం తో కూడిన చిత్రాలు తీయడం దర్శక, నిర్మాతల,  ప్రేక్షకుల ఉత్తమ అభిరుచికి అద్దం పడుతుంది.


---------

Lyrics


రామా ....రామా...

జానకీ జానే.. రామా


కదన నిదానం నాహం జానే 

మోక్ష కవాటం నాహం జానే 


(మళయాళ గాయకులు కవాడం అని పలుకుతారు. ట -డ యో: అభేద: అనుకోవాలి )


జానకీ జానే ...రామా 


విషాద కాలే సఖా త్వమేవ

భయాంధకారే ప్రభా త్వమేవ 


(Beautiful lyric for the above two lines)


భవాబ్ధి నౌకా త్వమేవ దేవా

భజే భవంతమ్ రమాభిరామా

జానకీ జానే ...రామా


దయా సమేత సుధా నికేత 

చిన్మకరంద నత మునిబృంద

ఆగమసార జిత సంసార

భజే భవంతమ్ మనోభిరామా


జానకీ జానే ...రామా 

కదన నిదానం నాహం జానే

మోక్ష కవాటం నాహం జానే 

జానకీ జానే... రామా 


--------

Sunday, February 16, 2025

కాశ్మీర పరిక్రమ - ఒక మంచి ధారా వాహిక కార్యక్రమం

(జగద్గురు ఆదిశంకర / జ్యేష్ఠేశ్వర దేవాలయం, శ్రీ నగర్)

SVBC వారు కాశ్మీర పరిక్రమ అనే ధారావాహిక  కార్యక్రమం కొన్ని సంవత్సరాల క్రితం రూపొందించారు. పున: ప్రసారం కూడా జరుగుతోంది. మంచి డాక్యుమెంటరీ దృశ్య రూపకం. 

ఇందులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని పురాతన హిందూ దేవాలయాలు ,  ఆ ఆలయాల విశిష్టత, చరిత్ర, స్థల పురాణాలు, కాలానుగుణంగా చెందిన మార్పులు,  ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితుల గురించి ధారావాహిక గా రూపొందించారు. పారుపల్లి రంగనాథ్ గారి నేపథ్య వ్యాఖ్యానం చెప్పే తీరు. ఆయన తెలుగు సంస్కృత భాష ఉచ్ఛారణ, స్పష్టత చాలా బాగున్నాయి.

ముఖ్యంగా కాశ్మీర శైవానికి సనాతన ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది.

కాశ్మీరు సహజ సుందర ప్రదేశం. భారత దేశానికి చూడామణి వంటిది. అక్కడి నదులు, పర్వతాలు, ప్రకృతి శోభ, గుహాలయాలు, మందిరాలు, అచ్చోట పరిఢవిల్లిన  వైదిక సంస్కృతి గురించి అనేక మంది కవులు చరిత్రకారులు అనాదిగా వర్ణిస్తూ వచ్చారు.

ఈ కార్యక్రమం చివరిలో కాశ్మీర దేశం ఔన్నత్యాన్ని వర్ణించే ఒక మధుర గీతం వస్తుంది. (18 వ నిముషం నుంచి)

----------

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

సుర నందనమిది కాశ్మీరంహ

హరి మందిరమిది కాశ్మీరం

హర సుందరీ భాల సింధూరం

తుషార నగవర చుంబితాధరం

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

సీతారామ పదాంబుజ సేవన పూత విమల కాసారం

ఉమా మహేశ్వర ప్రణయ కథాలయ తుంగ ధవళ శిఖరం

సూర్య, ద్రౌపది, వైష్ణో దేవి, అమరనాథ గృహ ప్రాకారం 

జ్వాలా మాల, మహా కాళికా, గౌరీ నిత్య విహారం

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

శ్రీమత్ శంకర బోధితాద్వైత దివ్య తత్వ సారం

మునిగణ కవివర పండిత మండిత అక్షర మణికా హారం

రసమయ ఫలభర తరుతత శోభిత 

నవనవోద్యాన కాంతారం 

సుమ సౌరభ గౌరవ మానిత శీతల

సుఖమయ ధీర సమీరం 

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

గీత రచన : (డా.) శ్రీ రాణి సదాశివ మూర్తి

సంగీతం :(డా.) శ్రీమతి సరస్వతీ వాసుదేవ్

గానం :(డా.) శ్రీమతి

 ఆర్. ఎన్ ఎస్. శైలేశ్వరి 

-------

ఈ గీతం  దేశ్, భాగేశ్రీ, సింధు భైరవి రాగాలు ఆధారంగా కూర్చబడింది. సాహిత్యం సంగీతం గానం చక్కగా ఉన్నాయి.

( అమరనాథ్ గుహాలయం)
(రఘునాథ్ మందిరం జమ్ము)
(మార్తాండ సూర్య దేవాలయం)

(మాతా వైష్ణోదేవి గుహాలయం)

(శ్రీ ఖీర్ భవానీ మాత మందిరం, శ్రీ నగర్)

కాశ్మీర ప్రదేశం తలపుకు వస్తే ప్రతి హిందువు హృదయంలో ఒక ఉద్వేగం, అనిర్వచనీయ మైన అనుభూతి కలుగుతాయి. అలాగే మత ఆక్రమణలలో చెదిరిపోయిన హిందూ రాజ్యాలు, క్షీణించిన హైందవ సంస్కృతి, దాడులలో ధ్వంసమై మతోన్మాదానికి సాక్షులుగా మిగిలిన శిధిలాలయాలు అంతులేని క్షోభలను అనుభవించి కాశ్మీరం నుంచి కాందిశీకులుగా చెదిరిపోయిన పండితుల దుస్థితి, సుందర పవిత్ర భూ భాగాన్ని కోల్పోయిన భారత దేశ చరిత్ర ముప్పిరిగొంటాయి. మనసులను కలచి వేస్తాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రదేశం లో భూతలంపై ఉన్న అత్యంత సుందర ప్రదేశాలు, హిమ శిఖరాలు, పర్వతాలు, లోయలు, నదీ నదాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అలాగే సరస్వతీ మాత శక్తి పీఠం కూడా ఆ ప్రదేశం లో ఉండిపోయింది అన్నవిషయం హిందువులకు ఎంతో ఖేదం కలిగిస్తుంది.

కాశ్మీర్ రాష్ట్రం లో ఉన్న శ్రీనగర్, అనంత్ నాగ్, శేష్ నాగ్, వేరి  నాగ్, బారాముల్ల (వరాహ మూల), అమర్ నాథ్ వంటి  నగరాల ప్రదేశాల పురాతనమైన  పేర్లు కాశ్మీర్ యొక్క భారతీయతకు సనాతన ధర్మానికి అద్దం పడతాయి.


(గిల్గిత్ బాల్టిస్తాన్ లోని రమణీయ ప్రదేశాలు)

(Picture credit. To the respective owners)

మార్తాండ సూర్య దేవాలయం వంటి శిధిలాలయాలు పునర్నిర్మాణం పునరుద్ధరణ జరిగితే అద్భుతంగా ఉంటుంది. స్వదేశం లోనే కాందిశీకులు గా మారిన కాశ్మీర్ పండితులు తిరిగి తమ మాతృభూమికి స్వస్థలాలకు గౌరవంగా , సురక్షితంగా చేరుకున్న రోజు కాశ్మీరం సంతసిస్తుంది. భారతీయుల దుఃఖం శమిస్తుంది.🙏🏻






Sunday, February 9, 2025

విచలిత మేధావులారా ! సనాతన ధర్మం పై ద్వేషం తగదు.

పత్రికలలో, సామాజిక మాధ్యమాల్లో హిందువులపై, సనాతన ధర్మం పై పనికట్టుకుని విషం చిమ్ముతున్న కొందరు వింత మనుషులు ఉన్నారు. తెలుగు బ్లాగుల్లో కూడా కవి, విమర్శకుడు పేరుతో ఇటువంటి ధోరణితో రచనలు చేస్తున్న ఒక మేధావి ఉన్నారు.


కొందరి జీవితాలు అకారణ ద్వేషం, అసహనం, అసూయ లతో నిండి ఉంటాయి. వీరిదొక విచిత్ర రీతి. విపరీత ధోరణి. తెలివైన వారై ఉంటారు.  డిగ్రీలు సంపాదిస్తారు. వ్యవస్థలలోని  సౌకర్యాలు, సదుపాయాలు పూర్తిగా ఉపయోగించుకుంటారు. సంతోషం.  జీవితం లో చక్కగా స్థిరపడతారు. కానీ ఆనందంగా ఉండలేరు. తమకు తాము మానసిక పంజరాలు సృష్టించుకుంటారు. సమాజంలోఎవరో  అన్యాయం చేశారు అని భావిస్తూ ఏ మాత్రం సంబంధం లేని వారిని బాధ్యులుగా చేసి వారిని ద్వేషించడం,  దూషించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. 


మనువాదం బ్రాహ్మణ వాదం అంటూ నిరంతరం జపం చేస్తుంటారు. అనవసర వివాదం వితండ వాదం చేస్తుంటారు. నిజానికి బ్రాహ్మణులకు, GC హిందువులకు ప్రస్తుతం సమాజంలో ప్రతికూలత ఉంది. అయితే బైటికి చెప్పుకునే పరిస్థితి లేదు.


విచలిత మేధావులు తమ స్వీయ సంస్కృతిని , స్వధర్మాన్ని,  మహనీయులను నిరాకరిస్తారు,  కించపరుస్తారు. తమ శక్తి యుక్తులను వృధా చేసుకుంటారు.


సనాతన ధర్మం పట్ల తీవ్ర వ్యతిరేక భావనలతో మనుగడ సాగిస్తూ ఉంటారు.

 

హిందువులు బుద్ధుడిని మహనీయుడుగా అంగీకరిస్తారు. గౌరవిస్తారు. అదే విధంగా ఇతర బౌద్ధ దేశాలలోని బౌద్ధ మతస్థులు, వారి మతాచార్యులు కూడా భారత దేశం పట్ల, హిందూ మతం పట్ల మన దేవతల పట్ల ఆరాధన భావం, సద్భావన కలిగి ఉండడం గౌరవంగా మెలగటం మనం చూడవచ్చు. అయితే భారత దేశంలో ఉండే కొంతమంది కుహనా మేధావులు మాత్రం పేరుకు బౌద్ధుల మని చెప్పుకుంటూ  హిందూ మతం పట్ల, సనాతన ధర్మం పట్ల, హిందూ మత ధర్మాచర్యుల పట్ల ద్వేష భావనతో దుష్ప్రచారం, దూషణల పర్వం సాగిస్తుంటారు. వీరు ఏమి సాధించాలనుకుంటున్నారో బోధ పడదు. మన భాగ్యం కొద్దీ దొరికారు వీరు.


ఆది శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసి గాసట బీసట గా విక్షేపం చెందుతున్న హిందూమతాన్ని పునరుజ్జీవనం చేశారు. ఆయన తన అపారమైన సిద్ధాంత బలంతో, అన్య మతాచార్యులతో వాదించి వారిని ఒప్పించి, వారి అజ్ఞాన వాదనలను తిప్పికొట్టి సనాతన ధర్మం సర్వ మానవాళికి అత్యంత శ్రేయోదాయకం అని నిరూపించారు. ధర్మం, ఆచారం, సిద్ధాంతం, మేధస్సు, దైవ బలం ఇవి శంకరాచార్యుల సాధానాలు. 


దౌర్జన్యం, హింస ఆక్రమణ ఇలాంటి దుర్మార్గపు చర్యలకు సనాతన ధర్మంలో ఆస్కారం, అవసరం లేదు. సనాతన ధర్మం సాగించేది విజయయాత్ర. సంకుచిత మతాలు చేసేది దండయాత్ర.


శంకరుల విజయం మరొకరి ఓటమి అనే సంకుచిత దృష్టి పనికిరాదు. సత్యానికి ధర్మానికి లభించిన విజయంగా భావించాలి. 


అలాగే బౌద్ధారామాల స్థానం లో ఆలయాలు నిర్మించారు అని వీరు అసత్య ప్రచారం చేస్తారు. ఇది కేవలం వామపక్ష ఇస్లామిక్ కుహనా చరిత్ర కారుల వక్ర సిద్ధాంతం మాత్రమే అని ధార్మిక చరిత్ర కారులు నిర్ద్వంద్వంగా నిరూపించారు 


బౌద్ధంలోని లేక ఇతర మతాలలో ఉన్న మంచి విషయాలను హిందువులు నిరాకరించరు.  పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, చాతుర్వర్ణవ్యవస్థ హిందూ మతం లో అంతర్భాగం. ఈ మేధావులు నుడివే వివక్ష సనాతన ధర్మం లో లేదు.  వర్ణ వైవిధ్యం తప్ప వర్ణ వివక్ష హిందూమతం ప్రతిపాదించ లేదు. దేశ కాల పరిస్థితులను అనుసరించి  తగిన మార్పులు చేసుకుంటూ హిందూ సమాజం ఎదిగింది. ప్రతి సమాజం లోనూ లోటు పాట్లు, వ్యత్యాసాలు, అపోహలు ఉంటాయి. ఈ లోపాలను చక్కదిద్దుతూ శంకరాచార్యుల వంటి  ధర్మచార్యులు సమాజాన్ని సరైన మార్గంలో నడిపించారు 


ఆది శంకరుల వారిని కించపరిచే ప్రయత్నం ఈ కుహనా మేధావుల అజ్ఞానం అవివేకాన్ని సూచిస్తుంది. అద్వైతం అర్థం చేసుకోవాలంటే ఒక మానసిక స్థాయి, open mind ఉండాలి. సంకుచిత మనస్కులకు అద్వైతం అర్థం కావడం అసాధ్యం. శంకరుల భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర వాజ్మయం మన దేశం మానవాళి కి అందించిన అమూల్యమైన కానుకలు. అలాంటి గొప్ప ఆధ్యాత్మిక సంపదను అర్థం చేసుకుని మన జీవితాలను చక్కదిద్దుకోవాలనే ఆలోచన ఉండదు. 

 

ఈ స్వయం ప్రకటిత మేధావులకు సనాతన ధర్మం పట్ల విశ్వాసం లేకపోతే పోవచ్చు. అది వారిష్టం.  అయితే సనాతన ధర్మం పాటించే వారిని , ధర్మాచార్యులను దూషించడం ఆమోదయోగ్యం కాదు. 


వారు శిరోధార్యం గా భావించే రాజ్యాంగం కూడా అన్ని మతాలు అనుసరించే వారికి వారి వారి ధర్మాన్ని ఆచరించే అధికారం ఇచ్చింది. ఏ హిందువైనా ఇలా అన్య మతాచార్యులు మహనీయులను అగౌరవ పరచడం లేదు కదా. 


మన దేశంలో వికృత మనస్కులైన మేధావుల వల్ల భావ కాలుష్యం, సమాజం లో వివిధ వర్గాల మధ్య మనస్పర్ధలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. వీరు అమాయకులైన సామాన్య ప్రజల మనసులను కలుషితం చేస్తారు. బౌద్ధమతం పరిఢవిల్లిన గాంధార దేశం (ఆఫ్ఘన్) లోని బమియన్ పెద్ద బుద్ధ విగ్రహాలను 2001 సం.   లో ధ్వంసం చేసిన ఇస్లామిక్ మతోన్మాదులు గురించి వీరు నోరు మెదపరు. బుద్ధుడిని భగవానుడు అని ఆరాధించే హిందువులపై ఆక్రోశిస్తారు. ఇదేమి మానసిక వైపరీత్యమో అర్థం కాదు. 


కేవలం హిందూ మతం పై విష ప్రచారం చేయడం వీరికి చేతనవుతుంది. అసలు ప్రమాదం ఎవరినుంచి రానుందో గ్రహించకుండా మాతృ స్థానంలో ఉన్న సనాతన ధర్మాన్ని నిందించడం, నిరాకరించడం ఆత్మ హత్యా సదృశం అని తెలుసుకోలేకున్నారు. హిందూ మతం ఇచ్చే రక్షణ లేని నాడు వీరికి ఈ దేశంలో నిలువనీడ కూడా ఉండదు అని గ్రహించలేక పోతున్నారు. ఇస్లామిక్ దేశాలలో హింసకు గురై మాతృదేశానికి కాందిశీకులుగా వచ్చిన వస్తున్న శిక్కులు, బౌద్ధలను ఆదరించే దేశం భారతదేశం. స్వంతవారిగా స్వీకరించే ధర్మం సనాతన ధర్మం. అలాంటి సహృదయత ఉన్న హిందువులపై ఈ ఆందోళన జీవులు ఇంత ద్వేషపూరిత భావన చూపటం దురదృష్ట కరం.


హిందూ మతం పై సనాతన ధర్మ మతాచార్యుల పై  దుష్ప్రచారం చేస్తున్న ఈ నిరర్థక మేధావుల చర్యలను హిందువులు అంగీకరించరు. తగిన సమాధానం చెబుతారు. 


ఈ భూమి పై ఉద్భవించిన బౌద్ధ, జైన, శిక్కు మతాలు సనాతన ధర్మం నుంచి జనించిన  శాఖలే. అయితే వేదములు, ప్రస్థాన త్రయం, అష్టాదశ పురాణాలు, రామాయణ భారతాలు పరమ ప్రమాణం. ఈ శాస్త్రాలు సమగ్రం, పరిపూర్ణం. అందున్న సత్యం మరెందు వెదకిన  దొరకదు.  ఈ విషయం బోధపడితే ఈ ఆందోళన జీవుల శశభిషలు ఉపశమిస్తాయి.


బుద్ధుడి బోధనలు కూడా సనాతన ధర్మంలో ఒక పార్శ్వం గా చూడాలి. ఆయన ప్రతిపాదించిన విషయాలలో మంచిని స్వీకరించడంలో అభ్యంతరం లేదు. బుద్ధ భగవానుడు ఇటువంటి వారికి సదవగాహన, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దృష్టి, సహనం, శాంతి, స్నేహ భావం కలగజేయాలని కోరుకుందాము.


ఆదిశంకరుల ఆత్మను, బోధను పరిపూర్ణంగా ఆవిష్కరించారు కీ. శే. యల్లంరాజు శ్రీనివాస రావు గారు. ఆయన రచించిన జగద్గురు మహోపదేశం పుస్తకం లింక్ ఇక్కడ ఇస్తున్నాను. ఈ పుస్తకం సద్భావన తో చదివితే అనేక సందేహాలకు అపోహలకు సమాధానం దొరుకుతుంది. అయితే ఆందోళన జీవులకు prejudiced minds కు ఆ సత్సంకల్పం కలుగుతుందా ? ఏ జన్మకైనా కలగాలని ఆశించుదాము.🙏🏻





Thursday, February 6, 2025

గార్దభ సూకర మైత్రి గీతం

ఈ గీత రచన ఒక విలక్షణ ప్రయోగం గా భావిస్తున్నాను. 

ఒక గాడిద 🐴 ఒక పంది 🐖 మధ్య మంచి స్నేహం ఉండి వారిరువురూ కలిసి ఆనందంగా ఒక పాట పాడుకుంటే ఎలావుంటుంది అన్న ఊహ లోనుంచి ఈ గీతం వచ్చింది. ఇది ఒక సరదా ప్రయోగం మాత్రమే తప్ప ఎటువంటి వెటకారం లేదా చెడు తలంపు లేదు అని మనవి. అనాదిగా మనుష్యులతో కలిసి జీవిస్తున్న రెండు జంతువుల పై అభిమానం తో వ్రాసిన పాట. నిజానికి ఆ రెండు జంతువుల మనసులోకి నేనే ప్రవేశించి వ్రాశాను.

నేను ముచ్చట పడి వ్రాసుకున్న పాట ఇది. ఎవరినీ ఉద్దేశించినది కాదు ఎటువంటి అపోహలకు తావులేదు అని మరొక్క సారి మనవి చేస్తున్నాను.  

-----------------

గా : నేనొక గాడిదను.

నీవొక మంచి పందివి -2

పం: నీవొక గార్దభము

నేనొక వరాహమును..


యుగళం : 

మనమిరువురము మంచి మిత్రులము

ఒకరికి ఒకరు తీసిపోము 


గా: నేనొక గాడిదను

నీవొక సూకరమవు -2

నేనొక మేలిమి గాడిదను...


గా: గార్దభమని నను పిలుచుచుందురు -2

పం: సూకరమని నను కొందరందురు -2


గా: ఖరమని కూడా పేరు పొందితిని

పం: వరాహమని నను ప్రీతి బిలిచిరి

గా : నేనొక గాడిదను.

నీవొక మంచి పందివి -2

పం: నీవొక గార్దభము

నేనొక వరాహమును..


గా: నిందలు విని విని చెందితి ఖేదం

గానముతో మరి పొందెద మోదం


పం: కలలో చెదరని మన మైత్రి

సృష్టిలో కడు వైచిత్రి

యుగళం : కలుగును మనకు ఘనకీర్తి


పం: నీవొక గార్దభము

నేనొక వరాహమును..


గా: నా గానం అమృత తుల్యం ....

పం: కర్ణపేయం నా గాత్రం ....

గా: నా కంఠములో రసవృష్టి 

పం: ఆస్వాదించే నా రసదృష్టి 


యుగళం: కలిసి చేద్దాము స్వరసృష్టి 


గా: సుగుణములు కల నా క్షీరం

పం: ఔషధములకై ఈ శరీరం


యుగళం : మనుజుల సేవకే మన మంకితం


నేనొక గార్దభము

నీవొక సూకరమవు -2

నేనొక మేలిమి గార్దభము...


--------------

నిజానికి ఈ గీతానికి దర్బారి కానడా రాగం లో ఒక అద్భుతమైన బాణీ కూడా కట్టాను. అది నాలో నేను పాడుకున్నాను. మంచి సంగతులతో బాణీ  చాలా బాగా వచ్చింది. అయితే రికార్డు చేసే సాహసం చేయలేక పోయాను.  ఒక వాగ్గాయ కారుడిగా నేను ఎంతో ఇష్టపడి వ్రాసిన తొలి గీతం ఇదే. 

🙏🏻🙏🏻






Friday, January 10, 2025

ధనుర్మాసం సంగీత విశేషాలు - భాగ్యనగరం

మార్గళి మాసం  చెన్నైలో కర్నాటక సంగీత కచ్చేరీల సీజన్. అనేక సంగీత సభలలో వర్ధమాన సంగీత కళాకారుల నుంచి నిష్ణాతుల  దాకా సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. శ్రోతల నుంచి విశేష ఆదరణ కూడా ఉంటుంది. వారి ధనుర్మాసం అంటే మనకు మార్గశిర పుష్య మాసాలలో సగం సగం రోజులు కలుస్తాయి.

హైదరాబాద్ లో కూడా వివిధ సంగీత సభలు పుష్య మాసంలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు , సంగీత సప్తాహాలు జరపడం ఆనవాయితీ.


ఈ ఏడాది సంప్రదాయ సంగీత ట్రస్టు అనే సంస్థ వారిచే సంకీర్తనోత్సవ్ -2025 జరుగుతోంది. ఉన్నత శ్రేణి విద్వాంసులతో కచేరీలు ఏర్పాటు చేశారు. వాణీ నగర్, మల్కాజ్ గిరి లో ఉన్న విజయ గణపతి ఆలయం ప్రాంగణంలో  కొన్ని రోజులుగా ఈ సభలు జరుగుతున్నాయి. గొప్ప సంగీత కళాకారుల కచ్చేరీ వినే మంచి అవకాశం వచ్చింది. కొన్ని విశేషాలు


1) డి వి మోహనకృష్ణ - 4-1-25 vocal

2) జొన్నలగడ్డ శ్రీరాం  - 5-1-25 vocal

3) విఘ్నేశ్ ఈశ్వర్ - 6-1-25 vocal

4) సంగీత కళానిధి టీ ఎమ్ కృష్ణ - 7-1-25 vocal

5) డి శ్రీనివాస్ - 8-1-25 - వీణ

6) సంగీత కళానిధి లాల్గుడి జి జె ఆర్ కృష్ణన్ - వయొలిన్ 9-1-25

7) మల్లాది బ్రదర్స్ - 10-1-25  vocal 


అన్ని కచేరీలు అద్భుతంగా జరిగాయి. పక్క వాద్యాలు కూడా పేరొందిన కళాకారులు సహకారం అందించారు.


4th Jan - మోహన కృష్ణ గారు బాలమురళి గారి బాణీ ని చక్కగా ప్రెజెంట్ చేశారు.  అక్కడక్కడా కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా ఓవరాల్ గా బాగుంది. ఆయన వయసు ఇతర పరిమితుల రీత్యా ఒక్కరే కచ్చేరీ చేయడం కంటే శిష్య బృందం తో కలిసి చేస్తూ ఒకటిరెండు పాటలు వరకే పాడితే నయమేమో అనిపించింది.


5-1-25 జొన్నలగడ్డ శ్రీరాం మంచి ప్రతిభ ఉన్న యువ గాయకుడు. He is a talented singer with good repertoire. అతని కచ్చేరీ ఆకట్టుకుంది. ముఖ్యంగా దీక్షితుల వారి ఆనంద నటన ప్రకాశం కృతి కేదార రాగం లో అద్భుతంగా వచ్చింది. Good accompanying artists enhanced the concert. ఇతను సంగీత ఆచార్యుడిగా కూడా రాణిస్తున్నాడు అని తెలిసింది. He was one of the key persons behind these concerts. 


On all days Sriram gave introduction and conclusion speeches with good narration about the artistes. He is very fluent in English too.


6th Jan - చెన్నై కు చెందిన  విఘ్నేశ్ ఈశ్వర్ కచ్చేరీ బాగా సాగింది. మంచి గాత్రం, రేంజి, ప్రతిభ కల గాయకుడు. He has gained a good name in Chennai circuit. It was really nice to hear his live concert. Mrudangam by Delhi Sai Ram was a blast. Sometimes it felt as though singer's voice was getting drowned in the accompanying instruments.


7 వ తారీఖున టి. ఎమ్ కృష్ణ కచ్చేరీ జరిగింది. ఈ సంవత్సరం మ్యూజిక్ అకాడమీ వారిచే సంగీత కళానిధి అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం చెన్నైలో ఇతనికి అవార్డు ఇవ్వడం పై పెద్ద వివాదమే జరుగుతోంది. అతని భావజాలం, ideology  పక్కన  పెడితే ఒక గాయకుడిగా ప్రతిభ కలవాడు అన్నది నిజం. జనం అధిక సంఖ్యలో వచ్చారు. కచ్చేరీ బాగా సాగింది. ముఖ్యంగా మనోధర్మం తో అతను ఎాడిన అలాపనలు ఆకట్టుకున్నాయి. He knows the art of playing to the gallery. He has a strong voice. He may not be a genius singer but with dint of hardwork he has achieved good success.ముఖ్యంగా వయొలిన్ సహకారం అందించిన హెచ్ ఎన్ భాస్కర్ అద్భుతంగా వాయించాడు. HN Bhaskar was too good.



8th Jan - Surprise. Real surprise package was the veena recital by D Srinivas Garu from Hyderabad. I didn't know that he plays so well. ఈతని వీణ కచ్చేరీ అద్భుతంగా జరిగింది. He has a pleasant demeanor and played in a relaxed manner. ముఖ్యంగా పక్క వాద్యం లెజెండ్ కార్తీక్ ఘటం వాయించడం అద్భుతం. పారుపల్లి ఫల్గుణ మృదంగం, కొమండూరు కృష్ణ వయొలిన్ సహకారం కూడా బాగుంది.


9-1-25 నాడు సంగీత కళానిధి సంగీత సామ్రాట్ లాల్ గూడి జయరామన్ తనయుడు 2022 సంగీత కళానిధి గ్రహీత లాల్గూడి కృష్ణన్ గారి వయొలిన్ కచ్చేరీ జరిగింది.

మోహన రాగం లో నను పాలింప నడచి వచ్చితివో.  ప్రధానమైన అంశంగా వినిపించారు. అధ్భుతం. భావప్రియ అనే అరుదైన రాగం లో  శ్రీకాంత నీ యెడ బలాతి బల అనే త్యాగరాజ స్వామి కీర్తన అలవోక గా వాయించారు.


I felt fortunate to hear the Great master from such proximity. His violin music flows like a river and virtually feels like a vocalist singing through violin 🎻. Felt happy to take a photo with him for which he agreed with a smile. 



10-1-25 - మల్లాది బ్రదర్స్ గాత్ర కచ్చేరీ జరిగింది. సంప్రదాయ సంగీత పద్ధతిలో సాహిత్యం, భావ ప్రకటన కు ప్రాధాన్యం ఇస్తూ సాగింది. As individual singers their performance is underwhelming. We can't expect elaborate and intricate alienations in their voice,  but when they sing together, they sound good. They are well trained singers with good repertoire and knowledge. Even though their voice is not very melodious, when they sing together, it is good to hear. 

భైరవి రాగం లో దీక్షితార్ కృతి 'బాల గోపాల పాలయ ఆశు మాం' ప్రధాన కీర్తన గా పాడారు. 
ఈ కచేరీ లో మల్లాది శ్రీరాం కుమార్ గారి తనయుడు మల్లాది శివానంద్ మృదంగం అద్భుతం గా వాయించాడు. I have no doubt in saying that he is an outstanding artiste. చిన్న వయసులోనే ఇంత గొప్పగా వాయించాడు. తను గాయకుడు గా కూడా రాణిస్తున్నాడు. He has bright future and will make malladi brothers proud. ప్రముఖ విద్వాంసుడు  ఎంబార్ కణ్ణన్ గారు వయొలిన్ అద్భుతంగా వాయించారు. He gracefully agreed to click a picture with him. మల్లాది శ్రీరాం గారు భద్రాచల రామదాసు కీర్తనలు శ్రోతలతో కలిసి పాడించారు. బాగుంది. 

ఈ వారం అంతా ఇలా అద్భుత సంగీత కళాకారుల కచేరీలు వినే భాగ్యం కలిగింది. ప్రతి రోజూ కార్యక్రమం చివర్లో  ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు.  నిర్వాహకుల కృషి, శ్రమ ఎంతైనా అభినందనీయం. 
పుష్య బహుళ పంచమి నుంచి మరో సంస్థ వారిచే సంగీత కార్యక్రమాలు  జరగనున్నాయి. 🙏🏻

Monday, December 30, 2024

హైదారాబాద్ పుస్తక ప్రదర్శన 2024 కబుర్లు


ఈ మారు పుస్తక ప్రదర్శనకు రెండు సార్లు వెళ్ళాను.  స్టాళ్లు బాగా ఏర్పాటు చేశారు.

మంచి నీరు,  కుర్చీలు కూడా సౌకర్యం చేశారు 


NTR స్టేడియం (తెలంగాణ కళాభారతి మైదానం) ప్రాంగణం ఇలాంటి ప్రదర్శనలకు , కోటి దీపోత్సవం వంటి వేడుకలకు అనువుగా ఉంటున్నది. 


గతంలో కొన్న పుస్తకాలు చాలా ఉన్నాయి. 


Self improvement కంటే shelf improvement జరిగింది. చదవడం పైన ఆసక్తి తగ్గింది. అందుకే కొత్తవి కొనడం తగ్గిపోయింది. 


ఒక వేదిక పై  యథా ప్రకారం కొంతమంది వామ పక్ష అభ్యుదయ, దళిత, ముస్లిం, స్త్రీ వాద రచయితలు తమ పుస్తకాలు ఆవిష్కరించడం తమ ధోరణిలో ప్రసంగించడం చూశాను. కొంతమందికి హిందూ సంస్కృతి సంప్రదాయాలు, హిందూ ధర్మం పట్ల విపరీత అభిప్రాయాలు విముఖత ఉంటాయి. ఈ పుస్తక ప్రదర్శన వేదికను వీరు బాగా ఉపయోగించు కున్నారు. ఈ పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు యాకూబ్ అనే రచయిత అని తెలిసింది.


అయితే స్టాళ్లు చూస్తే తెలుగు సాహిత్యం, హిందూ ఆధ్యాత్మిక స్టాళ్లు, సంప్రదాయ సాహిత్యం, సంస్కృత పుస్తకాల స్టాళ్లు దగ్గర జనం బాగా ఉన్నారు. కొంటున్నారు. 


అంబేద్కర్ సాహిత్యం, బుద్ధుడి రచనలు స్టాల్సు ఈ సారి కనిపించాయి.  


ఒక మతం వారు ఉచితంగా పుస్తకం ఇస్తున్నారు. ఆసక్తి లేక తీసుకోలేదు.  


కవితా సంకలనాలు , మహిళా రచయితల స్టాలు కనిపించాయి. ఏదో చెప్పాలి అనే ఆవేశం. తన భావాలు అందరికీ తెలియాలి అనే తపన రచయితలకు  సహజంగా ఉంటుంది. పుస్తకం అచ్చులో చూసుకుంటే అదొక తృప్తి. 


బాహ్య ప్రపంచం లో నైనా లేదా అంతరంగం లో నైనా చిత్ర విచిత్రమైన కల్పనలు చేయడం,  పాత నవ్వారు మంచాలపై ఉన్నా కొత్త బంగారు లోకాల గురించి కలలు కనడం మనిషికి సహజ లక్షణం. ఆ కలలకు అక్షర రూపం ఇచ్చే నేర్పు రచయితకు ఉంటే చదివి  ఆనందించే ఓర్పు పాఠకులకు ఉండాలి.


ప్రస్తుతం సమాజంలో మొబైల్ వాడకం ఎక్కువ అవడం వల్ల కొంతమేరకు attention span తగ్గిపోయింది. పుస్తకం ఆమూలాగ్రం చదివే కుదురు లేకుండా పోతుంది. వార్తా పత్రికలు కూడా హెడ్ లైన్స్ చదివి లోపల ఉన్నది మరీ ఆసక్తి గా ఉంటేనే చదువుతాము.


ఎక్కువ పుస్తకాలు కొని చదవలేక పోవడం కన్నా బాగా ఆసక్తి ఉన్న అంశాలపై వ్రాసిన పుస్తకాలు కొని శ్రద్ధగా చదవడం మంచిదేమో. 


ఉత్తమ గ్రంథాలు చదవడం, ఆకళింపు చేసుకోవడం, అందులో మంచి విషయాలు మననం చేసుకోవడం, నిజ జీవితంలో అనుభవానికి తెచ్చుకోవడం బాగుంటుంది.this is serious reading స్వాధ్యయం క్రిందికి వస్తుంది.


కొన్ని పుస్తకాలు సరదా కాలక్షేపం కోసం, మానసికోల్లాసం కోసం చదవడం కూడా మంచిదే. అయితే ఒక దశకు వచ్చాక నవల్సు వంటివి చదివే ఆసక్తి పోతుంది.


ఇష్టం ఉన్నా లేకున్నా పాఠ్య పుస్తకాలు చదవటం అందరికీ తప్పదు.


చందమామ, బాలమిత్ర బొమ్మరిల్లు కథలు ఒక దశ

యండమూరి మల్లాది యద్దనపూడి నవల్సు ఒక దశ

బుచ్చి బాబు, గోపీ చంద్, తిలక్.. రచనలు ఒక దశ

ఆధ్యాత్మిక బుక్స్ ఒక దశ

పురాణాలు బుక్స్ ఒక దశ

ప్రవచనాలు వినడం ఒక దశ

ఆసక్తి తగిపోవడం / లేక పోవడం ఒక దశ

Light reading time pass reading చేయడం ఎప్పుడూ ఉంటుంది  

అసలు పుస్తకాలే చదవనివారు కూడా ఉంటారు 

ఎక్కువగా పుస్తకాలు చదివే వారు ఉంటారు 


ఇలా సాగుతుంటుంది.


ఒక స్టాలు కార్టూనిస్టులు తీసుకున్నారు. అందులో సరసి కార్టూన్లు పుస్తకాలు రెండు తీసుకున్నాను. అడిగితే ఆయన పుస్తకాలపై సంతకం చేసి ఇచ్చారు. 


ఋగ్వేదం మంత్రాల స్వాధ్యాయం, శతక పద్యాలు పై రెండు పుస్తకాలు తీసుకున్నాను.  పూర్తిగా చదివే ప్రయత్నం చేయాలి.


పుస్తక పఠనాభిలాష పెరిగినట్లే కనిపిస్తుంది. ఆంగ్ల సాహిత్యం స్టాళ్లు, పాత పుస్తకాల స్టాళ్లు వద్ద కూడా బాగా జనం ఉన్నారు.


బాలల కోసం మంచి పుస్తకాలు కనిపించాయి.

నా కూడా ఉన్న మిత్రుడు ఒకరు గురవారెడ్డి రచించిన  గురవాయణం రెండు పుస్తకాలు కొన్నారు. మంచి క్వాలిటీ తో అచ్చు వేశారు. ఆయన లో ఉన్న హాస్య ప్రియత్వం, zest for life ఈ పుస్తకాలలో కనిపిస్తుంది.


public spaces అంతగా లేని హైదరాబాదులో పుస్తక ప్రదర్శనకు వెళ్ళడం ఒక ఆటవిడుపు లాగా ప్రజలకు అనిపిస్తుంది.


పుస్తకం మస్తక భూషణం అని తెలంగాణా ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి చెప్పారు. 


చాలా పుస్తకాలు చూస్తే అవి ఎంత పరిశోధన చేసి వ్రాశారో అని ఒకసారి ఎంత మంది చదువుతారు అని మరొకసారి సందేహం వస్తుంది. 


ఏది ఏమైనా పుస్తకం లో కొన్ని పేజీలైనా ప్రతి రోజూ చదవడం మంచి అలవాటు.


నేనొక దుర్గం, నాదొక స్వర్గం,  అనర్గళం, అనితర సాధ్యం, నా మార్గం అని చెప్పే గురువులవి కూడా ప్రత్యేక స్టాళ్లు ఉన్నాయి. అవి రెండు పుస్తకాలు కొంతకాలం క్రితం తీసుకున్నాను. అయితే అంతగా నచ్చలేదు. అయినా అన్ని పుస్తకాలు వ్రాయడం గొప్ప విషయమే.


వారిని అనుసరించే శిష్యులు అవి చదివి ఉంటారా అని అనుమానం.  చదవలేదు లేదా నచ్చలేదు అంటే ధిక్కారమున్ సైతునా అని గురువు గారికి కోపం రావచ్చు.


వారి వారి మానసిక స్థితిని, ఆసక్తిని బట్టి పుస్తకాలు చదివే తీరు, అభిరుచి లో మార్పు వస్తుంటుంది.


చక్కటి పుస్తక ప్రదర్శన ఉత్సవం ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభినందనీయులు.