Tuesday, January 13, 2026

కీరవాణి lyrics + ఇళయరాజా సంగీతం - ఒక మధుర గీతం

గత ఏడాది షష్టి పూర్తి అనే సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు. అందులో ,ఏదో ఏ జన్మ లోదో ఈ పరిచయం ' అనే పాట బాగుంది. We could see glimpses of vintage Ilayaraja in this song. 

సంగీత దర్శకుడు కీరవాణి ఈ పాటకు సాహిత్యం అందించాడు. ఈ పాటలో కొన్ని పదాలు మంచి భావుకత కలిగి ఉన్నాయి.

-----

తెరలు తెరలుగా తెరుచుకున్న తూరుపు ద్వారం

పొరలు పొరలుగా కరుగుతున్న నిశి భారం

------

అనన్య భట్ అనే గాయని ఈ పాట బాగా పాడింది.

కళ్యాణ వసంతం రాగం ఛాయలో ఈ గీతం ఉన్నట్టు అనిపిస్తుంది. 



Wednesday, November 19, 2025

మధుర గాయని పి. సుశీల గారి 90 వ జన్మదినం

Let us celebrate the legend's happy birthday.

మాయా బజార్ సినిమా 1957 లో వచ్చింది. ఆ చిత్రం లో ' అహ నా పెళ్ళి యంట' సుశీల గారు పాడారు. 68 సంవత్సరాల క్రిందటి పాట.   13-11-2025 నాడు ఆమె 90 వ జన్మదినం వచ్చింది.  మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలి అని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

1951 అంటే దాదాపు 75 సంవత్సరాల క్రితం ఆమె సినీ నేపథ్య గాయని గా పరిశ్రమలో ప్రవేశించారు.

మాయా బజార్ సినిమాలో పనిచేసిన ప్రముఖులలో సుశీల గారు , సింగీతం శ్రీనివాసరావు గారు ఇప్పడు మన మధ్య కనిపిస్తున్నారు.

కొన్ని ఛాయా చిత్రాలు ( అంతర్జాలం ద్వారా ) picture credit to the respective owners.


లతా , ఉషా మంగేష్కర్ గారితో సుశీల గారు 
శివాజీ గణేషన్, ఆశా భోంస్లే గారితో సుశీల గారు 
బాలు గారితో

TM సౌందర రాజన్, MS విశ్వనాథన్ గారితో
ఇళయరాజా గారు తో 

శ్రీమతి ఇందిరాగాంధీ గారితో సుశీల గారు

A beautiful song ' love birds' ( anbe vaa 1966 Tamil MS Viswanathan)

సుశీల గారికి ఈ సంవత్సరం పద్మ విభూషణ్ , దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఇవ్వాలి అని కోరుకుందాము.

🙏🙏🙏

Monday, March 10, 2025

శాస్త్రీయ సంగీత విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్ గారు అస్తమయం


గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు (76)  9-3-2025 తేదీన తిరుపతిలో ఉన్న తమ స్వగృహంలో పరమపదించారు. 🙏🏻

అన్నమాచార్య సంకీర్తనలు ఈనాడు తెలుగు ప్రజలకు బాగా చేరువ కావడానికి ప్రధాన కారణం గాయకులు, స్వరకర్త  శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు.  

తొలుత రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ, మల్లిక్, బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, వోలేటి, బాలమురళి గారు కొన్ని  సంకీర్తనలకు బాణీ కూర్చి తెలుగు శ్రోతలకు అన్నమయ్య గీతాల రుచి చూపించారు.

తొలి రోజులలో బ్రహ్మ కడిగిన పాదము, అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న వంటి కొన్ని కీర్తనలు బాగా వినిపించేవి. తరువాత బాలమురళి గారి గొంతులో ఇందరికి అభయంబు లిచ్చు చేయి, నారాయణ తే నమో, ఎక్కడి మానుష జన్మము వంటి గీతాలు శ్రోతలకు తెలిశాయి. 

శ్రీరంగం గోపాలరత్నం గారు  నల్లని మేని, సకలం హే సఖి, నమో నారాయణ, ఇద్దరి తమకము ... గీతాలు అద్భుతంగా స్వరపరచి పాడారు.  

టిటిడి వారు అన్నమయ్య ప్రాజెక్టు చేపట్టిన తరువాత అన్నమాచార్య గీతాలకు ఎనలేని ప్రాచుర్యం వచ్చింది. 

నేదునూరి గారు స్వరపరచిన ఏమొకో,  ముద్దుగారే యశోద, పలుకు తేనెల తల్లి, కంటి శుక్ర వారము, భావము లోన వంటి గీతాలు బహుళ ప్రజాదరణ పొందాయి.

నేదునూరి గారు స్వరపరచగా భారత రత్న ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారు అద్భుతంగా పాడిన అన్నమయ్య గీతాలు ఎనలేని ప్రాచుర్యం పొందాయి.

భావయామి గోపాల బాలం, శ్రీమన్నారాయణ, దేవదేవం భజే, నానాటి బ్రతుకు, మనుజుడై పుట్టి, జో అచ్యుతానంద... గీతాలు ఈనాటికీ శ్రోతలకు ఆనందం కలిగిస్తున్నాయి.  

80s 90s నుంచి నేదునూరి శిష్యులు బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజు గారు అన్నమాచార్య సంకీర్తనల వైభవం విస్తరింపజేశారు.

We can observe a nasal tinge in the voice of Balakrishna Prasad garu.

గాయకుడిగా అంతకుమించి స్వరకర్తగా ఆయన గొప్ప కృషి చేసి దాదాపు వెయ్యి సంకీర్తనలను స్వరపరిచారు. భక్తి భావం , సాత్విక గుణాలు ఆయనకు సహజ లక్షణాలు. అందువల్ల ఆయన స్వరపరచి గానం చేసిన అన్నమయ్య కీర్తనలు మరింతగా ఇనుమడించాయి.

తెలుగు వారు శుద్ధ శాస్త్రీయ సంగీతం కన్నా semi classical, devotional music ఎక్కువగా ఇష్టపడతారు. 

Prasad Garu may have limitations as a singer but as a composer he excelled. He rightly identified his strengths and composed semi classical and devotional music in a delightful  manner full of devotion. 

అన్నమయ్య కీర్తనలకు సముచితంగా స్వరం కూర్చడంలో ఆయన నిష్ణాతులైనారు. అన్నమయ్య సాహిత్యం అర్థం చేసుకుని భావం శ్రోతలకు చేరువయ్యేలా బాణీ కూర్చడంలో ఆయన ఒక benchmark set చేశారు.

శోభా రాజు, నాగేశ్వర నాయుడు, ఆనంద భట్టర్ గారు కూడా కొన్ని అన్నమయ్య కీర్తనలకు మంచి బాణీలు సమకూర్చి పాడారు.

ఇటీవలి కాలం లో మరికొంత మంది స్వరకర్తలు అన్నమయ్య గీతాలకు బాణీలు కడుతున్నారు. అయితే బాలకృష్ణ గారి స్వర రచనల లాగా అందులో అధిక భాగం నిలిచేవి కావు. 

అన్నమయ్య  ఆధ్యాత్మిక, శృంగార, జానపద, సంస్కృత భక్తి గీతాలు రచించాడు. ఆ రచనల వైవిధ్యాన్ని, నేపథ్యాన్ని, సాహిత్యాన్ని అవగాహన చేసుకుని స్వరాలు సమకూర్చడం ముఖ్యమైన విషయం. 

అన్నమయ్య సాహిత్యం ఆకళింపు చేసుకుని పద విభజన, విరామం, సంగతులు తగు విధంగా ఉండేలా చూసుకుంటూ కీర్తనకు సరిపోయే రాగం ఎంపిక చేసుకుని స్వరాలు కూర్చడంలో బాలకృష్ణ ప్రసాద్ గారిది అగ్రస్థానం. ఈ విషయం లో ప్రస్తుత స్వరకర్తలు ఆయన గీతాలను క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకుంటే బాగుంటుంది.

ముఖ్యంగా హిందోళం, మోహన రాగాలను ఆయన కీర్తనలలో  విస్తారంగా ఉపయోగించారు. హిందోళ రాగంలో ఉన్న వైవిధ్యాన్ని, range ను ఆయన లా explore చేసిన వారు మరొకరు లేరు అనే చెప్పాలి.

నారాయణా నీ నామమే గతి ఇక,

వచ్చెను అలమేలు మంగా,

అంతయు నీవే హరి పుండరీకాక్ష

సేవింపరో జనులాల

ఇటువంటి అద్భుత గీతాలు హిందోళం లో

మోహన రాగంలో గరిమెళ్ళ గారు స్వరపరిచిన

జగన్మోహనాకార,

పొడగంటిమయ్యా

నారాయణుడీతడు 

పరమ పురుషుడు

వంటి మధుర కీర్తనలు

తెలుగు ప్రజల మనసుల్లో శాశ్వతం గా చేరిపోయాయి.

వినరో భాగ్యము విష్ణుకథ, జయలక్ష్మీ వరలక్ష్మీ, చూడరమ్మ సతులాల, పిడికిట తలంబ్రాల, అన్నిమంత్రములు, ఓ పవనాత్మజ, మాధవా కేశవా, మెరుగు వంటిది, కొలువై ఉన్నాడు వీడే, హరినామమే కడు ..  ఇలా ఎన్నో అజరామర గీతాలు  అందించారు.

ఇటీవలి కాలంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన శివ పదం గీతాలకు స్వరాలు సమకూరుస్తున్నారు.

గణపతి కీర్తనలను స్వయంగా రచించి స్వరపరిచారు. 

ఆవిధంగా బాలకృష్ణ ప్రసాద్ గారు హరి హరుల ఇరు దైవముల సంగీతార్చనలో జీవితం ధన్యం చేసుకున్నారు. 

బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచిన అన్నమయ్య గీతాలలో నేను ప్రత్యేకంగా అభిమానించే కొన్ని గీతాలు:

' నారాయణా నీ నామమే గతి ఇక ' గీతం ఒక magnum opus అని అనిపిస్తుంది. ఈ గీతం స్వరం, గానం అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. నాదోపాసనకు ప్రతీక గా నిలచింది ఈ గీతం.

ఈ గీతం లో ని పదాలు - క్రింది లోకములు కీడు నరకములు అన్న చోట మంద్ర స్థాయిలో - అండనే స్వర్గాలవే మీదా అన్న చోట పై స్థాయిలో స్వరం కూర్చడం - బాలకృష్ణ ప్రసాద్ గారి ప్రతిభకు తార్కాణంగా కనిపిస్తుంది.

విన్న ప్రతిసారి దివ్యానుభూతి కలిగిస్తుంది ఈ  అద్భుతమైన గీతం. Outstanding composition full of devotion.

పాపపు రాశి అన్న చోట పాడిన తీరు ఒక అలౌకిక ఆనందం కలిగిస్తుంది.

అలాగే దేవా నమో దేవా అన్న గీతం హంసధ్వని రాగం లో అద్భుతం గా స్వరపరిచారు. 

This song is one of the best compositions in Hamsa Dhwani. He has lent a different flavour and explored the beauty of Hamsa dhwani. A brilliant composition indeed.

బుల్లెమ్మ  గారితో కలిసి పాడిన ఎంత మహిమో నీది అన్న గీతం చాలా బాగుంది. (రతి పతి ప్రియ రాగం)

జయలక్ష్మీ వరలక్ష్మీ. లలిత రాగం లో ఉన్న ఒక అద్భుత గీతం.

వచ్చెను అలమేలు మంగా అన్న గీతం  సంగీత, సాహిత్య పరంగా ఒక masterpiece అని చెప్పవచ్చు. 

మెరుగు వంటిది అలమేలు మంగ - ఖమాస్ రాగంలో ఉన్న ఈ కీర్తన కర్ణపేయం. అరి మురి నవ్వీని అన్న చోట ప్రసాద్ గారి ప్రతిభ తెలుస్తుంది. It bears the stamp of  unique musical idiom  of Telugu. Beautiful indeed.

జగన్మోహనాకార - మోహన రాగం లో ఉన్న ఒక మధుర గీతం. ఈ పాట వింటూ ఉంటే స్వామి ఎదుట నిలుచుని అన్నమయ్య పాడుతున్న భావం కలుగుతుంది. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము.

బాలకృష్ణ ప్రసాద్ గారి కుమారుడు  అనిల్ కుమార్ తో పాటు వారి  శిష్యులు ఆయన స్వరపరచిన గీతాలు పాడుతూ ఆయన సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 

ఎందరో సంగీత కళాకారులకు గరిమెళ్ళ గారి అన్నమయ్య గీతాల ద్వారా ఒక career ఏర్పడింది అనడం అతిశయోక్తి కాదు. వారు అందించిన భక్తి సంగీత వాహిని నిరంతరంగా ప్రవహించాలి.

వారికి పద్మ అవార్డు వచ్చి ఉంటే బాగుండేది. కనీసం posthumous గా అయినా పద్మ భూషణ్ అవార్డు ఇవ్వాలి అని ఆశిస్తున్నాను.

శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻

ఓం నమో వేంకటేశాయ 🙏🏻






Friday, February 21, 2025

ధ్వని (1988 ) - సంగీత భరిత చిత్రం

(picture credits to the respective owners)


తిరుపతి శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు ముత్యపు పందిరి వాహనసేవ  SVBC వాహినిలో ప్రత్యక్ష ప్రసారం చూస్తుండగా ' జానకీ జానే ' అన్న ఒక మధుర గీతం జేసుదాసు గళంలో వినిపించింది. ఇంత మంచి గీతం ఇదివరకు వినలేదే అనుకుంటూ అంతర్జాలంలో వివరాలు సేకరించాను.


ఆ గీతం ' ధ్వని ' అనే మళయాళ చిత్రం లోనిది అని తెలిసింది. Serendipity అంటే ఇదేనేమో.  ధ్వని చిత్రం యొక్క సంగీత విశేషాలు తెలుసుకుందాము అని చూస్తే . అన్నీ మంచి పాటలే ఉన్నాయి. 

సంగీతం : Legendary  Hindustsni film music director Naushad Ali composed the songs. అన్ని పాటలు జేసుదాస్ గారు పాడారు. రెండు పాటలు సుశీల గారు పాడారు. అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. We are fortunate to be born in the same era of legends like Yesudas, Susheela Garu అని మరొకసారి అనిపించింది.



ఈ చిత్రంలో జయరామ్ , శోభన నాయికా నాయికలు.


జానకీ జానే అన్న గీతం యమన్ కళ్యాణ్ రాగం లో ఉంది. జేసుదాస్ గారు సుశీలగారు ఇద్దరు పాడిన రెండు వెర్షన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. Both the songs are melodious in their golden voices.


ఒక విశేషం ఏమిటంటే ఈ గీతం శ్రీ రామచంద్రుని స్తుతించే ఒక సంస్కృత గీతం. రచన యూసఫ్ ఆలీ కెచేరి, సంగీతం నౌషాద్, గానం జేసుదాసు సుశీల. 


A beautiful musical and lyrical collaboration by great artists of three religions.


' అనురాగ లోల ' అనేది మరొక చక్కటి యుగళ గీతం. జేసుదాస్, సుశీలమ్మ గారు అద్భుతంగా పాడారు. ఈ పాట పట్ దీప్ అనే హిందూస్తానీ రాగం ఆధారంగా స్వరపరిచారు. ఈ పట్ దీప్ రాగం కర్నాటక సంగీత రాగం గౌరిమనోహరి రాగానికి చాలా దగ్గరగా ఉంటుంది. దాదాపు అవే స్వరాలు కలిగి ఉంటుంది. పాట చాలా బాగా వచ్చింది. Short and sweet.


ఈ రాగంలో మేఘా ఛాయే ఆధీ రాత్ అన్న ప్రసిద్ధ గీతం ఉంది ( శర్మీలీ చిత్రం)


తక్కిన పాటలు కూడా శాస్త్రీయ రాగాల ఆధారంగా సరళంగా స్వరపరచబడి వినటానికి  హాయిగా ఉన్నాయి. 


' ధ్వని ' చిత్రం గీతాల juke Box 


మళయాళ సాహిత్యం లో సంస్కృత పదాల ప్రభావం తెలుగు కంటే కూడా ఎక్కువ. సినీ గీతాలలో కూడా సంస్కృత పదాలు విరివిగా ఉపయోగిస్తారు.  


అనురాగ లోల గాత్రి, నీల రాత్రి, లయ లాస్య కలా కాంతి, ద్యుతి నిన్ముఖారవిందం, ప్రాణ సఖి, రజనీ రాజ ముఖి, హిమ మణిమాల, మంజీర ధ్వని, మంజుల హాసం, మాధవ మాసం , భాసుర కావ్యం, నిర్వృతి.... ఇలా ప్రతి గీతం సంస్కృతపద భూయిష్టం గా సాగుతుంది.


ఇలాంటి మధుర సంగీతం, సాహిత్యం తో కూడిన చిత్రాలు తీయడం దర్శక, నిర్మాతల,  ప్రేక్షకుల ఉత్తమ అభిరుచికి అద్దం పడుతుంది.


---------

Lyrics


రామా ....రామా...

జానకీ జానే.. రామా


కదన నిదానం నాహం జానే 

మోక్ష కవాటం నాహం జానే 


(మళయాళ గాయకులు కవాడం అని పలుకుతారు. ట -డ యో: అభేద: అనుకోవాలి )


జానకీ జానే ...రామా 


విషాద కాలే సఖా త్వమేవ

భయాంధకారే ప్రభా త్వమేవ 


(Beautiful lyric for the above two lines)


భవాబ్ధి నౌకా త్వమేవ దేవా

భజే భవంతమ్ రమాభిరామా

జానకీ జానే ...రామా


దయా సమేత సుధా నికేత 

చిన్మకరంద నత మునిబృంద

ఆగమసార జిత సంసార

భజే భవంతమ్ మనోభిరామా


జానకీ జానే ...రామా 

కదన నిదానం నాహం జానే

మోక్ష కవాటం నాహం జానే 

జానకీ జానే... రామా 


--------

Sunday, February 16, 2025

కాశ్మీర పరిక్రమ - ఒక మంచి ధారా వాహిక కార్యక్రమం

(జగద్గురు ఆదిశంకర / జ్యేష్ఠేశ్వర దేవాలయం, శ్రీ నగర్)

SVBC వారు కాశ్మీర పరిక్రమ అనే ధారావాహిక  కార్యక్రమం కొన్ని సంవత్సరాల క్రితం రూపొందించారు. పున: ప్రసారం కూడా జరుగుతోంది. మంచి డాక్యుమెంటరీ దృశ్య రూపకం. 

ఇందులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని పురాతన హిందూ దేవాలయాలు ,  ఆ ఆలయాల విశిష్టత, చరిత్ర, స్థల పురాణాలు, కాలానుగుణంగా చెందిన మార్పులు,  ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితుల గురించి ధారావాహిక గా రూపొందించారు. పారుపల్లి రంగనాథ్ గారి నేపథ్య వ్యాఖ్యానం చెప్పే తీరు. ఆయన తెలుగు సంస్కృత భాష ఉచ్ఛారణ, స్పష్టత చాలా బాగున్నాయి.

ముఖ్యంగా కాశ్మీర శైవానికి సనాతన ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది.

కాశ్మీరు సహజ సుందర ప్రదేశం. భారత దేశానికి చూడామణి వంటిది. అక్కడి నదులు, పర్వతాలు, ప్రకృతి శోభ, గుహాలయాలు, మందిరాలు, అచ్చోట పరిఢవిల్లిన  వైదిక సంస్కృతి గురించి అనేక మంది కవులు చరిత్రకారులు అనాదిగా వర్ణిస్తూ వచ్చారు.

ఈ కార్యక్రమం చివరిలో కాశ్మీర దేశం ఔన్నత్యాన్ని వర్ణించే ఒక మధుర గీతం వస్తుంది. (18 వ నిముషం నుంచి)

----------

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

సుర నందనమిది కాశ్మీరంహ

హరి మందిరమిది కాశ్మీరం

హర సుందరీ భాల సింధూరం

తుషార నగవర చుంబితాధరం

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

సీతారామ పదాంబుజ సేవన పూత విమల కాసారం

ఉమా మహేశ్వర ప్రణయ కథాలయ తుంగ ధవళ శిఖరం

సూర్య, ద్రౌపది, వైష్ణో దేవి, అమరనాథ గృహ ప్రాకారం 

జ్వాలా మాల, మహా కాళికా, గౌరీ నిత్య విహారం

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

శ్రీమత్ శంకర బోధితాద్వైత దివ్య తత్వ సారం

మునిగణ కవివర పండిత మండిత అక్షర మణికా హారం

రసమయ ఫలభర తరుతత శోభిత 

నవనవోద్యాన కాంతారం 

సుమ సౌరభ గౌరవ మానిత శీతల

సుఖమయ ధీర సమీరం 

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

గీత రచన : (డా.) శ్రీ రాణి సదాశివ మూర్తి

సంగీతం :(డా.) శ్రీమతి సరస్వతీ వాసుదేవ్

గానం :(డా.) శ్రీమతి

 ఆర్. ఎన్ ఎస్. శైలేశ్వరి 

-------

ఈ గీతం  దేశ్, భాగేశ్రీ, సింధు భైరవి రాగాలు ఆధారంగా కూర్చబడింది. సాహిత్యం సంగీతం గానం చక్కగా ఉన్నాయి.

( అమరనాథ్ గుహాలయం)
(రఘునాథ్ మందిరం జమ్ము)
(మార్తాండ సూర్య దేవాలయం)

(మాతా వైష్ణోదేవి గుహాలయం)

(శ్రీ ఖీర్ భవానీ మాత మందిరం, శ్రీ నగర్)

కాశ్మీర ప్రదేశం తలపుకు వస్తే ప్రతి హిందువు హృదయంలో ఒక ఉద్వేగం, అనిర్వచనీయ మైన అనుభూతి కలుగుతాయి. అలాగే మత ఆక్రమణలలో చెదిరిపోయిన హిందూ రాజ్యాలు, క్షీణించిన హైందవ సంస్కృతి, దాడులలో ధ్వంసమై మతోన్మాదానికి సాక్షులుగా మిగిలిన శిధిలాలయాలు అంతులేని క్షోభలను అనుభవించి కాశ్మీరం నుంచి కాందిశీకులుగా చెదిరిపోయిన పండితుల దుస్థితి, సుందర పవిత్ర భూ భాగాన్ని కోల్పోయిన భారత దేశ చరిత్ర ముప్పిరిగొంటాయి. మనసులను కలచి వేస్తాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రదేశం లో భూతలంపై ఉన్న అత్యంత సుందర ప్రదేశాలు, హిమ శిఖరాలు, పర్వతాలు, లోయలు, నదీ నదాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అలాగే సరస్వతీ మాత శక్తి పీఠం కూడా ఆ ప్రదేశం లో ఉండిపోయింది అన్నవిషయం హిందువులకు ఎంతో ఖేదం కలిగిస్తుంది.

కాశ్మీర్ రాష్ట్రం లో ఉన్న శ్రీనగర్, అనంత్ నాగ్, శేష్ నాగ్, వేరి  నాగ్, బారాముల్ల (వరాహ మూల), అమర్ నాథ్ వంటి  నగరాల ప్రదేశాల పురాతనమైన  పేర్లు కాశ్మీర్ యొక్క భారతీయతకు సనాతన ధర్మానికి అద్దం పడతాయి.


(గిల్గిత్ బాల్టిస్తాన్ లోని రమణీయ ప్రదేశాలు)

(Picture credit. To the respective owners)

మార్తాండ సూర్య దేవాలయం వంటి శిధిలాలయాలు పునర్నిర్మాణం పునరుద్ధరణ జరిగితే అద్భుతంగా ఉంటుంది. స్వదేశం లోనే కాందిశీకులు గా మారిన కాశ్మీర్ పండితులు తిరిగి తమ మాతృభూమికి స్వస్థలాలకు గౌరవంగా , సురక్షితంగా చేరుకున్న రోజు కాశ్మీరం సంతసిస్తుంది. భారతీయుల దుఃఖం శమిస్తుంది.🙏🏻






Sunday, February 9, 2025

విచలిత మేధావులారా ! సనాతన ధర్మం పై ద్వేషం తగదు.

పత్రికలలో, సామాజిక మాధ్యమాల్లో హిందువులపై, సనాతన ధర్మం పై పనికట్టుకుని విషం చిమ్ముతున్న కొందరు వింత మనుషులు ఉన్నారు. తెలుగు బ్లాగుల్లో కూడా కవి, విమర్శకుడు పేరుతో ఇటువంటి ధోరణితో రచనలు చేస్తున్న ఒక మేధావి ఉన్నారు.


కొందరి జీవితాలు అకారణ ద్వేషం, అసహనం, అసూయ లతో నిండి ఉంటాయి. వీరిదొక విచిత్ర రీతి. విపరీత ధోరణి. తెలివైన వారై ఉంటారు.  డిగ్రీలు సంపాదిస్తారు. వ్యవస్థలలోని  సౌకర్యాలు, సదుపాయాలు పూర్తిగా ఉపయోగించుకుంటారు. సంతోషం.  జీవితం లో చక్కగా స్థిరపడతారు. కానీ ఆనందంగా ఉండలేరు. తమకు తాము మానసిక పంజరాలు సృష్టించుకుంటారు. సమాజంలోఎవరో  అన్యాయం చేశారు అని భావిస్తూ ఏ మాత్రం సంబంధం లేని వారిని బాధ్యులుగా చేసి వారిని ద్వేషించడం,  దూషించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. 


మనువాదం బ్రాహ్మణ వాదం అంటూ నిరంతరం జపం చేస్తుంటారు. అనవసర వివాదం వితండ వాదం చేస్తుంటారు. నిజానికి బ్రాహ్మణులకు, GC హిందువులకు ప్రస్తుతం సమాజంలో ప్రతికూలత ఉంది. అయితే బైటికి చెప్పుకునే పరిస్థితి లేదు.


విచలిత మేధావులు తమ స్వీయ సంస్కృతిని , స్వధర్మాన్ని,  మహనీయులను నిరాకరిస్తారు,  కించపరుస్తారు. తమ శక్తి యుక్తులను వృధా చేసుకుంటారు.


సనాతన ధర్మం పట్ల తీవ్ర వ్యతిరేక భావనలతో మనుగడ సాగిస్తూ ఉంటారు.

 

హిందువులు బుద్ధుడిని మహనీయుడుగా అంగీకరిస్తారు. గౌరవిస్తారు. అదే విధంగా ఇతర బౌద్ధ దేశాలలోని బౌద్ధ మతస్థులు, వారి మతాచార్యులు కూడా భారత దేశం పట్ల, హిందూ మతం పట్ల మన దేవతల పట్ల ఆరాధన భావం, సద్భావన కలిగి ఉండడం గౌరవంగా మెలగటం మనం చూడవచ్చు. అయితే భారత దేశంలో ఉండే కొంతమంది కుహనా మేధావులు మాత్రం పేరుకు బౌద్ధుల మని చెప్పుకుంటూ  హిందూ మతం పట్ల, సనాతన ధర్మం పట్ల, హిందూ మత ధర్మాచర్యుల పట్ల ద్వేష భావనతో దుష్ప్రచారం, దూషణల పర్వం సాగిస్తుంటారు. వీరు ఏమి సాధించాలనుకుంటున్నారో బోధ పడదు. మన భాగ్యం కొద్దీ దొరికారు వీరు.


ఆది శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసి గాసట బీసట గా విక్షేపం చెందుతున్న హిందూమతాన్ని పునరుజ్జీవనం చేశారు. ఆయన తన అపారమైన సిద్ధాంత బలంతో, అన్య మతాచార్యులతో వాదించి వారిని ఒప్పించి, వారి అజ్ఞాన వాదనలను తిప్పికొట్టి సనాతన ధర్మం సర్వ మానవాళికి అత్యంత శ్రేయోదాయకం అని నిరూపించారు. ధర్మం, ఆచారం, సిద్ధాంతం, మేధస్సు, దైవ బలం ఇవి శంకరాచార్యుల సాధానాలు. 


దౌర్జన్యం, హింస ఆక్రమణ ఇలాంటి దుర్మార్గపు చర్యలకు సనాతన ధర్మంలో ఆస్కారం, అవసరం లేదు. సనాతన ధర్మం సాగించేది విజయయాత్ర. సంకుచిత మతాలు చేసేది దండయాత్ర.


శంకరుల విజయం మరొకరి ఓటమి అనే సంకుచిత దృష్టి పనికిరాదు. సత్యానికి ధర్మానికి లభించిన విజయంగా భావించాలి. 


అలాగే బౌద్ధారామాల స్థానం లో ఆలయాలు నిర్మించారు అని వీరు అసత్య ప్రచారం చేస్తారు. ఇది కేవలం వామపక్ష ఇస్లామిక్ కుహనా చరిత్ర కారుల వక్ర సిద్ధాంతం మాత్రమే అని ధార్మిక చరిత్ర కారులు నిర్ద్వంద్వంగా నిరూపించారు 


బౌద్ధంలోని లేక ఇతర మతాలలో ఉన్న మంచి విషయాలను హిందువులు నిరాకరించరు.  పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, చాతుర్వర్ణవ్యవస్థ హిందూ మతం లో అంతర్భాగం. ఈ మేధావులు నుడివే వివక్ష సనాతన ధర్మం లో లేదు.  వర్ణ వైవిధ్యం తప్ప వర్ణ వివక్ష హిందూమతం ప్రతిపాదించ లేదు. దేశ కాల పరిస్థితులను అనుసరించి  తగిన మార్పులు చేసుకుంటూ హిందూ సమాజం ఎదిగింది. ప్రతి సమాజం లోనూ లోటు పాట్లు, వ్యత్యాసాలు, అపోహలు ఉంటాయి. ఈ లోపాలను చక్కదిద్దుతూ శంకరాచార్యుల వంటి  ధర్మచార్యులు సమాజాన్ని సరైన మార్గంలో నడిపించారు 


ఆది శంకరుల వారిని కించపరిచే ప్రయత్నం ఈ కుహనా మేధావుల అజ్ఞానం అవివేకాన్ని సూచిస్తుంది. అద్వైతం అర్థం చేసుకోవాలంటే ఒక మానసిక స్థాయి, open mind ఉండాలి. సంకుచిత మనస్కులకు అద్వైతం అర్థం కావడం అసాధ్యం. శంకరుల భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర వాజ్మయం మన దేశం మానవాళి కి అందించిన అమూల్యమైన కానుకలు. అలాంటి గొప్ప ఆధ్యాత్మిక సంపదను అర్థం చేసుకుని మన జీవితాలను చక్కదిద్దుకోవాలనే ఆలోచన ఉండదు. 

 

ఈ స్వయం ప్రకటిత మేధావులకు సనాతన ధర్మం పట్ల విశ్వాసం లేకపోతే పోవచ్చు. అది వారిష్టం.  అయితే సనాతన ధర్మం పాటించే వారిని , ధర్మాచార్యులను దూషించడం ఆమోదయోగ్యం కాదు. 


వారు శిరోధార్యం గా భావించే రాజ్యాంగం కూడా అన్ని మతాలు అనుసరించే వారికి వారి వారి ధర్మాన్ని ఆచరించే అధికారం ఇచ్చింది. ఏ హిందువైనా ఇలా అన్య మతాచార్యులు మహనీయులను అగౌరవ పరచడం లేదు కదా. 


మన దేశంలో వికృత మనస్కులైన మేధావుల వల్ల భావ కాలుష్యం, సమాజం లో వివిధ వర్గాల మధ్య మనస్పర్ధలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. వీరు అమాయకులైన సామాన్య ప్రజల మనసులను కలుషితం చేస్తారు. బౌద్ధమతం పరిఢవిల్లిన గాంధార దేశం (ఆఫ్ఘన్) లోని బమియన్ పెద్ద బుద్ధ విగ్రహాలను 2001 సం.   లో ధ్వంసం చేసిన ఇస్లామిక్ మతోన్మాదులు గురించి వీరు నోరు మెదపరు. బుద్ధుడిని భగవానుడు అని ఆరాధించే హిందువులపై ఆక్రోశిస్తారు. ఇదేమి మానసిక వైపరీత్యమో అర్థం కాదు. 


కేవలం హిందూ మతం పై విష ప్రచారం చేయడం వీరికి చేతనవుతుంది. అసలు ప్రమాదం ఎవరినుంచి రానుందో గ్రహించకుండా మాతృ స్థానంలో ఉన్న సనాతన ధర్మాన్ని నిందించడం, నిరాకరించడం ఆత్మ హత్యా సదృశం అని తెలుసుకోలేకున్నారు. హిందూ మతం ఇచ్చే రక్షణ లేని నాడు వీరికి ఈ దేశంలో నిలువనీడ కూడా ఉండదు అని గ్రహించలేక పోతున్నారు. ఇస్లామిక్ దేశాలలో హింసకు గురై మాతృదేశానికి కాందిశీకులుగా వచ్చిన వస్తున్న శిక్కులు, బౌద్ధలను ఆదరించే దేశం భారతదేశం. స్వంతవారిగా స్వీకరించే ధర్మం సనాతన ధర్మం. అలాంటి సహృదయత ఉన్న హిందువులపై ఈ ఆందోళన జీవులు ఇంత ద్వేషపూరిత భావన చూపటం దురదృష్ట కరం.


హిందూ మతం పై సనాతన ధర్మ మతాచార్యుల పై  దుష్ప్రచారం చేస్తున్న ఈ నిరర్థక మేధావుల చర్యలను హిందువులు అంగీకరించరు. తగిన సమాధానం చెబుతారు. 


ఈ భూమి పై ఉద్భవించిన బౌద్ధ, జైన, శిక్కు మతాలు సనాతన ధర్మం నుంచి జనించిన  శాఖలే. అయితే వేదములు, ప్రస్థాన త్రయం, అష్టాదశ పురాణాలు, రామాయణ భారతాలు పరమ ప్రమాణం. ఈ శాస్త్రాలు సమగ్రం, పరిపూర్ణం. అందున్న సత్యం మరెందు వెదకిన  దొరకదు.  ఈ విషయం బోధపడితే ఈ ఆందోళన జీవుల శశభిషలు ఉపశమిస్తాయి.


బుద్ధుడి బోధనలు కూడా సనాతన ధర్మంలో ఒక పార్శ్వం గా చూడాలి. ఆయన ప్రతిపాదించిన విషయాలలో మంచిని స్వీకరించడంలో అభ్యంతరం లేదు. బుద్ధ భగవానుడు ఇటువంటి వారికి సదవగాహన, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దృష్టి, సహనం, శాంతి, స్నేహ భావం కలగజేయాలని కోరుకుందాము.


ఆదిశంకరుల ఆత్మను, బోధను పరిపూర్ణంగా ఆవిష్కరించారు కీ. శే. యల్లంరాజు శ్రీనివాస రావు గారు. ఆయన రచించిన జగద్గురు మహోపదేశం పుస్తకం లింక్ ఇక్కడ ఇస్తున్నాను. ఈ పుస్తకం సద్భావన తో చదివితే అనేక సందేహాలకు అపోహలకు సమాధానం దొరుకుతుంది. అయితే ఆందోళన జీవులకు prejudiced minds కు ఆ సత్సంకల్పం కలుగుతుందా ? ఏ జన్మకైనా కలగాలని ఆశించుదాము.🙏🏻





Thursday, February 6, 2025

గార్దభ సూకర మైత్రి గీతం

ఈ గీత రచన ఒక విలక్షణ ప్రయోగం గా భావిస్తున్నాను. 

ఒక గాడిద 🐴 ఒక పంది 🐖 మధ్య మంచి స్నేహం ఉండి వారిరువురూ కలిసి ఆనందంగా ఒక పాట పాడుకుంటే ఎలావుంటుంది అన్న ఊహ లోనుంచి ఈ గీతం వచ్చింది. ఇది ఒక సరదా ప్రయోగం మాత్రమే తప్ప ఎటువంటి వెటకారం లేదా చెడు తలంపు లేదు అని మనవి. అనాదిగా మనుష్యులతో కలిసి జీవిస్తున్న రెండు జంతువుల పై అభిమానం తో వ్రాసిన పాట. నిజానికి ఆ రెండు జంతువుల మనసులోకి నేనే ప్రవేశించి వ్రాశాను.

నేను ముచ్చట పడి వ్రాసుకున్న పాట ఇది. ఎవరినీ ఉద్దేశించినది కాదు ఎటువంటి అపోహలకు తావులేదు అని మరొక్క సారి మనవి చేస్తున్నాను.  

-----------------

గా : నేనొక గాడిదను.

నీవొక మంచి పందివి -2

పం: నీవొక గార్దభము

నేనొక వరాహమును..


యుగళం : 

మనమిరువురము మంచి మిత్రులము

ఒకరికి ఒకరు తీసిపోము 


గా: నేనొక గాడిదను

నీవొక సూకరమవు -2

నేనొక మేలిమి గాడిదను...


గా: గార్దభమని నను పిలుచుచుందురు -2

పం: సూకరమని నను కొందరందురు -2


గా: ఖరమని కూడా పేరు పొందితిని

పం: వరాహమని నను ప్రీతి బిలిచిరి

గా : నేనొక గాడిదను.

నీవొక మంచి పందివి -2

పం: నీవొక గార్దభము

నేనొక వరాహమును..


గా: నిందలు విని విని చెందితి ఖేదం

గానముతో మరి పొందెద మోదం


పం: కలలో చెదరని మన మైత్రి

సృష్టిలో కడు వైచిత్రి

యుగళం : కలుగును మనకు ఘనకీర్తి


పం: నీవొక గార్దభము

నేనొక వరాహమును..


గా: నా గానం అమృత తుల్యం ....

పం: కర్ణపేయం నా గాత్రం ....

గా: నా కంఠములో రసవృష్టి 

పం: ఆస్వాదించే నా రసదృష్టి 


యుగళం: కలిసి చేద్దాము స్వరసృష్టి 


గా: సుగుణములు కల నా క్షీరం

పం: ఔషధములకై ఈ శరీరం


యుగళం : మనుజుల సేవకే మన మంకితం


నేనొక గార్దభము

నీవొక సూకరమవు -2

నేనొక మేలిమి గార్దభము...


--------------

నిజానికి ఈ గీతానికి దర్బారి కానడా రాగం లో ఒక అద్భుతమైన బాణీ కూడా కట్టాను. అది నాలో నేను పాడుకున్నాను. మంచి సంగతులతో బాణీ  చాలా బాగా వచ్చింది. అయితే రికార్డు చేసే సాహసం చేయలేక పోయాను.  ఒక వాగ్గాయ కారుడిగా నేను ఎంతో ఇష్టపడి వ్రాసిన తొలి గీతం ఇదే. 

🙏🏻🙏🏻