Saturday, March 28, 2015

ఒకపరి అన్నమయ్య ఇంకొకపరి తిరుమలయ్య

పెద తిరుమలయ్య - అన్నమయ్య సుపుత్రుడు- తండ్రి వొరవడిని అందిపుచ్చుకున్న మహా పండితుడు. - తండ్రి శైలిలోనే శ్రీనివాసునిపై అపురూపమైన కీర్తనలు రచియించాడు.
మేలుకో శృంగార రాయ -ఒకపరి కొకపరి వయ్యారమై-గోవిందాశ్రిత గోకులబృంద-వేదములే నీ నివాసమట విమల నారసింహా--రంగరంగ రంగపతి రంగనాథ - ఇవి పెద తిరుమలయ్య రచనలు. 
ఇటీవల తిరుమలయ్య ప్రణీత   'చక్రవాళ మంజరీ' అన్న లఘు ద్విపద కృతి- తితిదే వారి లఘు పుస్తకం  చదివాను. తిరుమల శ్రీనివాసాచార్య వ్యాఖ్యతో. వ్యాఖ్యానం అరటి పండు వొలిచి పెట్టి నట్టుగా అర్థమవుతున్నది. 

కావ్యం సంగ్రహంగా ఉన్నా హృదయం సంగ్రహించేలా ఉన్నది. కొన్ని విశేషాలు. 
సాధారణంగా ద్విపద ఛందస్సు లో - ప్రతి పాదంలోనూ మూడు ఇంద్రగణాలు ఒక సూర్య గణము ఉంటాయి. ప్రాస, యతి ఉండాలి. ప్రాసయతి కూడదు. 
ప్రాస నియమం లేని ద్విపద మంజరీద్విపద అవుతుంది.  మంజరీద్విపదకు ముక్తపదగ్రస్తం అనే లక్షణము (సమాసాంతం లో గానీ , పాదాంతంలో గానీ ఉన్న రెండు అక్షరాలను మాత్రమే గ్రహించి మలి సమాసంగానీపాదంగానీ మొదలవ్వాలి) తోడయితే అది చక్రవాళ మంజరీ కావ్యమవుతుంది. 

వ్యాఖాత మాటల్లోనే... 
" ముక్తపదగ్రస్తముండే  మంజరీద్విపదలు వ్రాయటం కష్టమైన కార్యం. దీనికి విశేషమైన పాండిత్యం, శబ్దాధికారం, రచనా సామర్థ్యం ఉండాలి". 
కావ్య వస్తువు -  శ్రీనివాసునికై పద్మావతీ దేవి విరహము- చెలుల రాయబారము- నీలతోయద సన్నిభుడైన శ్రీనివాసునికి విద్యుల్లేఖా ఇవ భాస్వరా అయినటువంటి పద్మావతికి కళ్యాణము. - తొల్లింటినగర ప్రవేశము. 
చక్రవాళంలోని చక్రకేళులు.. 

శ్రీలలనాధారు జిన్మయాకారుగారుణ్యవర్తి వేంకటగిరిమూర్తి 
మూర్తిత్రయ శరీరు మునిజనోద్ధారుధారుణీసంగు నుత్తమ శోభితాంగు 
నంగుష్ఠ భవసిందు యదులోక బంధు  । బంధురబలశూరు భక్తవిచారు

డైన శ్రీనివాసుని ..

కొనియాడ విని యొక్క కొండుక కొమ్మ । కొమ్మలలో నెలకొన్న పూమొగ్గ 
మ్రొగ్గని మరుదంతి మోహన వాణివాణీశ సంస్తుత వరహావభావ 
భావజుయంత్రంబు పగిది పూబోడి పోడిమిగల మంచి పుత్తడి బొమ్మ
పద్మావతీ దేవి వలచింది. 
పద్యసాహిత్యం గురించి ఏమీ తెలియని పామరుడికైనా ఆసక్తి కలిగే విధంగా ఉన్న ఈ లఘుకృతి  సులభగ్రాహ్యమైన వ్యాఖ్యానం తో నన్ను ఎంతో ఆకట్టుకున్నది. 
తాళ్ళపాక పాకశాసనుడు అన్నమయ్యకు, పెద తిరుమలయ్యకు నమస్సుమాంజలి.