Saturday, September 24, 2011

కారుచీకటిలో కాంతి రేఖవై మూగగుండెలో దివ్యవాణివై

70 వ దశకం చివర్లో ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రతి ఆదివారం ఏసు ప్రభువు పాటలు పెట్టేవారు ఉదయం ఎనిమిదింటికి అనుకుంటా. అవి ఈ నాటికి నా మదిలో పదిలంగా ఉన్నాయి. అద్భుతమైన బాణీలు. అంతకు మించిన గానం సుశీల బాలు గార్లది. ఈ పాటలకు స్వరకర్త ఎవ్వరో నాకు ఇప్పటికీ తెలియలేదు. బహుశ: పాలగుమ్మి విశ్వనాథంగారేమో అని నా ఊహ. జాలం పుణ్యమా అని ’హృదయమే నీ ఆలయం క్రీస్తు’ ఆదిగా గల అన్నిపాటలు మళ్ళీ వినగలుగుతున్నాను.

ఈ క్రీస్తుపాటల సంకలనం లో నాకు అమితంగా నచ్చిన కొన్ని పాటలు.

హృదయమే నీ ఆలయం క్రీస్తూ.

ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో

శాశ్వతమా ఈ దేహం

ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం

నేనే మార్గము సత్యము జీవముని

ఈ లంకెలో పాటలు వినవచ్చు

ముఖ్యంగా ’మధుర మధుర సేవ ’ అనే పాట ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. దేశ్ రాగంలోని వినసొంపుదనం. బాలుగారి అద్భుతగానం ఈ పాటకు ప్రాణం పోశాయి. ఒకే గీత సంకలనంలో ఇన్ని ఆణిముత్యాలు పొదిగిన స్వరకర్తకు పాదాభివందనం చేయాలనిపిస్తుంది.
సుశీలగారు, బాలుగారు ఈ పాటలను గొప్పగాపాడారో చెప్పటానికి మాటలు చాలవు. ఈ తరం శ్రోతలు తప్పక విని శాశ్వతంగా భద్రపరచుకోవాల్సిన పాటలు ఇవి. సాహిత్యం కొంచెం typically క్రైస్తవంగా అనిపిస్తుంది కానీ బాణీల లోని మాధుర్యం మాటలను అధిగమిస్తుంది.

తెలుగుదనం, భారతీయత ఉట్టిపడే ఈ పాటలు తప్పక ఒకసారి స్మరించుకోవటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కరుణామయుడైన యేసు ప్రభువు ప్రశాంత వదనం కళ్ళకు కట్టించే పాటలు ఇవి.

నేను క్రైస్తవుడిని కాను కాని ఈ పాటలు మాత్రం నేను అమితంగా అభిమానిస్తాను. స్వస్తి.