Wednesday, October 1, 2014

సంగీత కళానిధి పాట - సంగీత శాస్త్ర 'మేలుప్రతినిధి' మాట



తెలుగునాట కర్ణాట సంగీతపు  పెద్దదిక్కు అయిన నేదునూరి - సంగీత నాట్యశాస్త్ర పండిత వర్యుడైన పప్పు వేణుగోపాలరావు గార్లు కలసి అన్నమయ్య - రామదాసు ల పాటలను వివరిస్తున్న lecture-demo దృశ్యకం
 ఆకట్టుకుంటుంది. 
ఈ ఉదాహరణ సహిత ఉపన్యాసంలో  ఆసక్తి కలిగించిన అంశాలు కొన్ని. 

1)  కర్ణాటక సంగీతపు nobel prize గా భావించే సంగీత కళా నిధి పురస్కారం అందుకున్న తెలుగు వారి సంఖ్య పది లోపే. అది నేదునూరి గారు 1991 లో అందుకున్నారు.  పై ఉపన్యాసంలోవారి మాటల్లోనే..  ఆయనకు సంగీత కళా నిధి propose చేసినది సెమ్మంగూడి గారు. second చేసినవారు m.s. సుబ్బలక్ష్మిగారు.  ఈ ఒక్క సంగతి చాలు నేదునూరి విద్వత్తు ఎంత గొప్పదో తెలియటానికి. 

తెలుగువారిలో నేదునూరిగారి తరువాత సంగీతకళానిధి అందుకోగల ఒకే ఒక ఆశాదీపం mandolin శ్రీనివాస్ మనలని  వదలి వెళ్లిపోయాడు. కనుచూపు మేరలో ఇంకెవరూ లేరు.  

(వారికి ఇంతదాకా పద్మ పురస్కారం ఇవ్వకపోవటం బాధాకరం. ఈ ఏడాది వారికి 'పద్మ విభూషణ్' ఇస్తేనే ఇంతకాలం నిర్లక్ష్యించిన పాపానికి నిష్కృతి.) 

2)  త్యాగరాజస్వామి వారి 12 కీర్తనలకు కూడా నేదునూరిగారు స్వరకల్పన చేశారని తెలియవచ్చింది. ఈ మహత్కార్యానికి తగినవారు వారే 

3) అన్నమయ్య గీతాలను  కీర్తన స్థాయిలో స్వరపరచి  పరిపూర్ణతను చేకూర్చారు పరమ సంప్రదాయవాది నేదునూరి గారు. . పలుకుతేనెల తల్లి, ముద్దుగారే యశోద, పొలతి జవ్వనము, నానాటి బ్రతుకు నాటకము, పురుషోత్తముడవీవు, భావములోనా బాహ్యమునందున.. ఈ అన్నమయ్య గీతాలకు శాశ్వతత్వాన్ని చేకూర్చారు నేదునూరి గారు.  

4) పప్పు వేణుగోపాల్ గారు ఒక encyclopaedia అని చెప్పవచ్చు.  క్లిష్టమైన అంశాలను audience స్థాయికి తగ్గట్టుగా వివరించటం ఆయన ప్రత్యేకత. ఒకేవ్యక్తిలో  సంస్కృత, తెలుగు భాషా పాండిత్యం, నాట్య శాస్త్రం, సంగీత శాస్త్రం ఇన్ని విద్యలు ఉండటం తెలుగువారికే గర్వకారణం. నేదునూరి గారి నుంచి అద్భుతమైన విశేషాలను పూవునుంచి భ్రమరం  మధువును లాగిన విధాన చక్కగా రాబట్టారు. 

5) నేదునూరి గారు అంత చక్కగా ఆంగ్లంలో మాట్లాడుతారని  తెలిసింది.  

 పై ఉపన్యాసం ఆద్యంతం ఆసక్తికరంగా  educative గా ఉన్నది.  audience లో కొద్దిమందే కనిపించారు. 

ఇటువంటి దృశ్యకాలు youtube ద్వారా  ఎంతోమందికి చేరాలి. 
నాకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని కలిగించిన video ఇది.