Sunday, April 5, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-4 - దుడుకు గల

సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామినే నమ:


శ్రీ స్వామివారు ప్రసాదించిన  పంచ రత్నములలో అతి సుందరమైన శైలిలో రచింపబడి   'గౌళ ' రాగం లో స్వరపరచబడిన 'దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా '  కీర్తన శ్రీరామ చంద్రమూర్తికి  స్వామివారు నిర్మింపజేసిన కృతిమణిమంటపము లో  విశిష్ట రత్నఖచిత  స్వర్ణ సింహాసనము వలె విరాజిల్లుతున్నది. 

గౌళ రాగము 15 వ మేళకర్త రాగమైన అతి ప్రసిద్ధమైన , పెద్ద ముత్తైయుదువు రాగాలలో ఒకటైన   'మాయా మాళవ గౌళ'  జన్యము. 

ఆరోహణ లో ఔడవ (ఐదు స్వరాలు) - స రి మ ప ని స

అవరోహణలో షాడవ- వక్ర (వరుస మార్చుకునే  ఆరుస్వరాలు) 

స ని ప మ రి గ మ రి స -  మూర్చన కలిగి ఉన్నది. 

స్వామి వారు - దుడుకు గల , ఎన్నో అవలక్షణాలు, బలహీనతలు  గల,  మనలాంటి మనుష్యుల గురించి శ్రీరామునికి నివేదిస్తున్నారు అని తెలియటం సమంజసంగా ఉంటుంది.  శ్రీ స్వామివారు 'దుడుకు గల' అన్నా అన్నమాచార్యులు  ' పురుషోత్తముడవీవు, పురుషాధముడ నేను' అన్నా అది మనగురించే కాని పరమభక్తులు, దైవంశ సంభూతులైన తమ గురించి కాదు అని భావించవలెనని పండితులు విశద పరిచినారు . 

కీర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 

పల్లవి - దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో -దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

అనుపల్లవి - కడు దుర్విషయాకృష్టుడై  గడియ గడియకు నిండారు  -దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 1 - శ్రీ వనితా హృత్కుముదాబ్జ! అవాంగ్మానసగోచర!

దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 2 - సకల భూతముల యందు నీవై యుండగ మతి లేక పోయిన - దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 3 - చిరుత ప్రాయముల  నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన 
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 4 - పర ధనముల కొరకు నొరుల మదిని
కరగబలికి కడుపు నింప దిరిగినట్టి
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 5 - తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే
యనుచు సదా దినములు గడిపెడి
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 6 - తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌట కుపదేశించి సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 7 - దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను దేవాది దేవ నెరనమ్మితిని గాకను
పదాబ్జ భజనంబు మరచినదుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 8 - చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన

దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 9 - మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక , మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక నరాధములను రోయ సారహీన మతములను సాధింప తారుమారు
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

అనుబంధము - సతులకై కొన్నాళ్లాస్తికై  సుతులకై కొన్నాళ్లు 
ధన తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా
----------------------------------
అనుక్షణం దుర్విషయాలకు ఆకర్షితుడవుతూ - 
కుతర్కముతో బాల్య, కౌమార, యౌవన  దశలలో జీవితం వ్యర్థ పరచుకుంటూ  
సుఖ జీవనమొక్కటే పరమావధిగా భావించుచూ-  
లలన (సతులు) అర్భక (సంతతి) సదన (గృహము) సేన (అనుచరులు) అమిత ధనాదులకై పరితపించుచూ - 
బ్రహ్మత్వానికి దూరమై తామసిక జీవనం గడుపుచూ 
శ్రీ రాముని చింతన మరచిపోయిన జనులను  చూసి ఇటువంటి జనులను ఏ దొర కొడుకు బ్రోచునో యని 
స్వామివారు  పొందిన  ఆవేదన ఈ కీర్తనలో కనిపిస్తుంది. 

ఇదే సందర్భంలో రెండు  అన్నమయ్య కృతులు స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. 
-------------------------
పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను
ధరలో నాయందు మంచితన మేది

అనంతాపరాధములు అటు నేము సేసేవి
అనంతమయినదయ అది నీది
నిను నెఱగకుండేటి నీచగుణము నాది
నను నెడయకుండేగుణము నీది

సకలయాచకమే సరుస నాకు బని
సకలరక్షకత్వము సరి నీపని
ప్రకటించి నిన్ను దూరేపలుకే నా కెప్పుడూను
వెకలివై ననుగాచేవిధము నీది

నేర మింతయును నాది నేరు పింతయును నీది
సారెకు నజ్ఞాని నేను జ్ఞానిని నీవు
యీరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది
-----------------------------------------
ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది |
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము |
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుజ్ఞనంబును మరచెద తత్త్వ రహస్యము  |
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు |
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును |
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల |
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై |
నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||
------------------------------------
మాయకు లోనై దుష్కర్మలను ఆచరించే మనుష్యులనుద్దేశించి భగవద్గీతలో

" మమ మాయా దురత్యయా, 
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే " అని చెప్పారు. 


Malladi Brothers Voice - దుడుకు గల 


రామే చిత్తలయః సదా భవతు మే భో ! రామ ! మాముద్ధర 



Wednesday, April 1, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-3 - జగదానంద కారక

సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామినే నమ:




శ్రీ స్వామివారు అనుగ్రహించిన పంచ రత్నములలో పూర్తిగా సంస్కృతం లో వ్రాయబడి  'నాట' రాగం లో స్వరపరచబడిన 'జగదానంద కారక'  కీర్తన శ్రీరామ చంద్రునికి స్వామివారు సమర్పించిన సంగీత మకుటంలోని  ఇంద్రనీలమణి గా  భాసిల్లుతున్నది. 

పల్లవి 'జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయక' విన్నంతనే పట్టాభిషిక్తుడై  అయోధ్యాపుర వాసుల జయ జయ ధ్వానాలు అందుకుంటున్న , శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేత శ్రీరామ చంద్రుడు మనోనేత్రంపై సాక్షాత్కారం పొందిన అనిర్వచనీయమైన ఆనందం కలుగజేస్తుంది.

కృతి లో అత్యద్భుతమైన అమృతతుల్యమైన పద బంధాలు , భక్తిసాగరం లో ఓలలాడింపజేసే సమాసాలు ఆద్యంతం మేలిమి బంగారు హారంలో మణులవోలె పొదగబడ్డాయి. 

నాట రాగం 36 వ మేళకర్త రాగం 'చల నాట' జన్యం. నాట రాగం సహజాత 'గంభీర నాట రాగం'. ఆరోహణలో సంపూర్ణ, అవరోహణలో ఔడవ (ఐదు) స్వరాలు కలిగి ఉన్నది.  

నక రాగమైన చలనాట కంటే కూడా నాట రాగం ప్రాచుర్యం పొందింది. కచేరి ప్రారంభం లోనే నాట రాగ కృతి పాడడం  మంగళప్రదం గా భావించడం జరుగుతుంది. 

  
నాట రాగం లో ప్రసిద్ధి పొందిన కృతి శ్రీ  ముత్తుస్వామి దీక్షితుల వారి ' మహా గణపతిం మనసా స్మరామి' ఉన్నది.

కీర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 

పల్లవి : జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా

అనుపల్లవి : గగనాధిప సత్కులజ ! రాజ రాజేశ్వర !

సుగుణాకర ! సురసేవ్య! భవ్య దాయక !
సదా సకల - జగదానంద కారకా

చ. 1 : అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణానఘ !  సుర సురభూజ !దధి పయోధి వాస హరణ! సుందరతర వదన! సుధామయ వచోబృంద ! గోవింద ! సానంద! మావరాజరాప్త శుభకరానేక (మా వర +అజర  + ఆప్త శుభకర) -

జగదానంద కారకా

చ. 2. నిగమ నీరజామృతజ పోషకానిమిశవైరి వారిద సమీరణ

ఖగ తురంగ సత్కవి హృదాలయాగణిత (హృదాలయ+  అగణిత) వానరాధిప నతాంఘ్రియుగ ! - జగదానంద కారకా

చ. 3. ఇంద్ర నీలమణి సన్నిభాపఘన (సన్నిభ+ అపఘన)   చంద్ర సూర్య నయనా ప్రమేయ (నయన + అప్రమేయ) వాగిన్ద్ర జనక ! సకలేశ! శుభ్ర !నాగేంద్ర శయన ! శమన వైరి సన్నుత - జగదానంద కారకా


చ.4. పాద విజిత మౌని శాప ! సవ పరిపాల ! వర మంత్ర

గ్రహణ లోల ! పరమ శాంత చిత్త ! జనకజాధిప! సరోజభవ !వరదాఖిల  -  జగదానంద కారకా

చ. 5. సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదాసమాన గాత్ర (ఫలద + అసమాన గాత్ర)! శచీపతి నుతాబ్ధి మద హరా (శచీపతి నుత +అబ్ధి మద హర)  అనురాగ రాగరాజిత కధాసార! హిత!

జగదానంద కారకా

చ. 6. సజ్జన మానసాబ్ధి సుధాకర ! కుసుమ విమాన !సురసారిపు కరాబ్జ లాలిత చరణావగుణాసురగణ మద హరణ !సనాతనాజనుత! (సనాతన + అజనుత)  - జగదానంద కారకా


చ. 7. ఓంకార పంజర కీర ! పుర హర, సరోజ భవ, కేశవాది రూప ! వాసవరిపు జనకాంతక ! కళాధర  కళాధరాప్త కరుణాకర శరణాగత జనపాలన సుమనోరమణ! నిర్వికార! నిగమ సారతర! జగదానంద కారకా


చ. 8. కరధృత శరజాలాసుర మదాపహరణావనీసుర సురావన కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత -  జగదానంద కారకా


చ. 9. పురాణ పురుష !నృవరాత్మజ ! ఆశ్రిత పరాధీన ! ఖర   విరాధ  రావణ విరావణ ! అనఘ ! పరాశర మనోహరావికృత ! త్యాగరాజ సన్నుత ! - జగదానంద కారకా


చ. 10 .అగణిత గుణ ! కనక చేల ! సాల విదళనారుణాభ సమాన చరణాపార మహిమాద్భుత సుకవిజన హృత్సదన ! సుర మునిగణ విదిత ! కలశనీర నిధిజా రమణ ! పాప గజ నృసింహ !వర త్యాగరాజాధినుత ! - జగదానంద కారకా


జయ జానకీ ప్రాణ నాయకా

జగదానంద కారకా

విశేషఅంశాలు :


  • గగనాధిప సత్కులజ - ఉత్తమమైన సూర్యవంశం లో జన్మించిన వాడు . 
  • అమర తారక నిచయ - దేవతలు అనే నక్షత్ర తతికి 
  • కుముద హిత పరిపూర్ణ - పూర్ణ చంద్రుని వంటివాడు. 
  • సుర సురభూజ - దేవతలకే కల్పవృక్షము వంటి వాడు. 
  • దధి పయోధి వాస హరణ - కృష్ణుడిగా పెరుగు, పాలు, గోపికల వస్త్రములు హరించినవాడు. 
  • మావరాజరాప్త శుభకర (మా వర +అజర  + ఆప్త శుభకర) - లక్ష్మీదేవి వల్లభుడు, నిత్య యవ్వనుడు, ఆప్తులకు శుభములు చేకూర్చువాడు) 
  • నిగమ నీరజామృతజ పోషక (వేదములు అనే పద్మములకు పోషణ నొసగే సూర్యుని వంటివాడు) 
  • అనిమిశవైరి వారిద సమీరణ (అనిమిషేయులు (ఱెప్పపాటు  లేనివారు) అయిన దేవతలకు శత్రువులైన రాక్షస మేఘాల పాలిటి సుడిగాలి వంటివాడు.)
  • వాగిన్ద్ర జనక - వాగధీశ్వరి శ్రీ సరస్వతి దేవి నాథుడైన బ్రహ్మ కు తండ్రి.  
  • శమన వైరి సన్నుత - కాలకాలుడైన పరమశివునిచే పూజింపబడువాడు. 
  • పాద విజిత మౌని శాప - పాద స్పర్శచే అహల్యాదేవి శాపము బాపినవాడు. 
  • సవ పరి పాల - కౌశికు యాగము కాచిన వాడు.  
  • నురాగ రాగరాజిత కధాసార - ప్రేమానురాగాలకు ప్రతిరూపమైన రామాయణ కథకు  సారభూతుడు. 
  • సురసారిపు కరాబ్జ లాలిత చరణా - సురస అనే రాక్షసిని సంహరించిన ఆంజనేయ స్వామిచే పూజించబడువాడు. 
  • సనాతనాజనుత - (సనాతనుడు, అజ (బ్రహ్మ) నుతుడు. )
  • ఓంకార పంజర కీర - ఓంకార పంజరము లోని  శుకుడు.
  • వాసవరిపు జనకాంతక - ఇంద్రజిత్తు తండ్రి అయిన రావణుని అంతము చేసినవాడు. 
  • కళాధర  కళాధరాప్త - షోడశ కళాధరుడైన చంద్రుడి కళను ధరించిన వాడు అయిన శివుడికి ఆప్తుడు.   
  • అవనీసుర సురావన - భూసురులు , దేవతలను కాపాడు వాడు. 
  • కవీన బిలజ మౌని - కవిసూర్యుడు, వాల్మీకి మహర్షి 
  • సాల విదళన - ఏడు సాల చెట్లను ఒక్క బాణముతో  కూల్చిన వాడు
  •  కలశనీర నిధిజా రమణ - క్షీరాబ్ధి కన్యక యైన శ్రీ మహాలక్ష్మి నాథుడు. 
  •  పాప గజ నృసింహ - మదగజపు పరిమాణం గల పాపపు రాశి పాలిట నరసింహుడు. 
ఈ కీర్తనలో  స్వామివారి నోట అమృతధార లాగ జాలువారిన  ఒక్కొక్క పదం  తారక మంత్రమై  శ్రీరామ చంద్రుని భక్తి సామ్రాజ్యంలో   పుష్పాభిషేకం చేసిన అనుభూతి కలుగిస్తుంది. 

ఈ కీర్తన చెవాలియార్ బాలమురళి గళములో  


శ్రీ శార్వరి నామ సంవత్సర శ్రీరామ నవమి సందర్భంగా 'జగదానంద కారకుని జయ జానకీ నాయకుని' స్మరించుకోవడం  పరమానంద దాయకం. 

శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి | 


శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే | | 




Saturday, March 28, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-2 - ఎందరో మహానుభావులు

సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామినే నమ: 





స్వామి వారు మనకు ప్రసాదించిన అతి మధురమైన అమిత ప్రాచుర్యం పొందిన  పంచరత్న కృతి - ఎందరో మహానుభావులు అందరికీ వందనములు (శ్రీ రాగం, ఆది తాళం)

స్వామి వారు రామ చంద్రునితో పాటుగా రామ భక్తులను కూడా ప్రస్తుతించడం, భక్తులు ఆనందంతో గానం చేయడాన్ని చూసి పరమానందం పొందడం కొన్ని కీర్తనలలో చూడ వచ్చు. (హరిదాసులు వెడలె ). ఈ కీర్తన పూర్తిగా హరి భక్తులను కీర్తిస్తున్నది.  

' ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ' అన్న పాట ఎత్తుగడ లోనే హృదయం ఉప్పొంగిపోతుంది.

అనుపల్లవిలో చందురు వర్ణుని అని శ్రీరాముని వర్ణించారు. స్వామి నీల మేఘ శ్యాముడు  కానీ ఇక్కడ వర్ణుని అంటే చల్లని వెండి చందమామ  వంటి ఆహ్లాదకరమైన ప్రకాశం కలవాడు అనే అర్థం కావచ్చును. పాఠ అంతరం లో చందురు  వదనుని అని కూడా కనిపిస్తుంది.  

శ్రీ రాగం 22వ మేళకర్త రాగమైన  ఖరహరప్రియ జన్యము. రాగం మూర్చన లోని 

ఆరోహణలో  ఔడవ (ఐదు స్వరాలు) - "స రి మ ప ని స "

అవరోహణ లో  వక్ర సంపూర్ణ రాగం -
 " స ని ప (ద ని ప) మ రి గ రి స "

వరోహణ లోని   'రి గ రి స ' , 'ప ద ని ప మ' వరుసలు ఈ రాగానికి ఎనలేని సొగసును మాధుర్యాన్ని కలుగజేస్తాయి. 

కీర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 

ప: ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

అ .ప. : చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

చ. 1: సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

చ 2. మానసవన చర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారెందరో మహానుభావులు

చ 3. సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు

చ 4.  పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు

చ 5. హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెందరో మహానుభావులు

చ 6. హొయలు మీర నడలు గల్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
గలవారెందరో మహానుభావులు

చ 7. పరమ భాగవత మౌనివర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనకకశిపుసుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమలభవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

చ 8. నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము ఈవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
వారెందరో మహానుభావులు

చ 9. భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను శివాది షణ్మతముల  గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన
వారెందరో మహానుభావులు

అనుబంధము:  ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు

విశేషఅంశాలు : 

మానస వనచర సంచారము నిలిపి  - మనస్సు అనే కోతి నిలకడలేమిని కట్టడి చేసి . 

స్వాంతమను - మనస్సు అను 

కమలభవ సుఖము - బ్రహ్మానందము  

ఒక్కొక్క చరణం విస్తరించుకుంటూ చివరి చరణం లో ఒక crescendo కు చేరుకోవడం ,చివరికి  అనుబంధం తో ముక్తాయించడం మనసును పరవశింపజేస్తుంది. 

ఎందరో మహానుభావులు కీర్తన ఎందరో మహా గాయకులు పాడినా సంగీత సామ్రాట్ బాలమురళి గాత్రంలో వినడం ఒక మధురానుభూతి కలిగిస్తుంది. 

స్వ. నాగయ్య గారు జీవం పోసిన త్యాగయ్య చిత్రం లోని 

అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచిన అన్నమాచార్య గీతం ' ఓ పవనాత్మజ ఓ ఘనుడా' లో ' పాద సరోరుహ' అన్న పదం దగ్గర ' ప ద ని ప మ ' అన్న శ్రీరాగం ముద్ర స్పష్టంగా తెలుస్తుంది.

శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి. 




Thursday, March 26, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-1 - సాధించెనే






సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు నాకు అత్యంత ప్రీతి పాత్రమైనవి. 

ఎన్నాళ్లూరకే యుండి ఇప్పుడు అభిమాన పూర్వకం గా ఈ కీర్తనలపైన కొన్ని మాటలు  వ్రాయ సంకల్పించాను. 

ఒక సాధారణ  అభిమానిగా మాత్రమే తప్ప  విపుల భాష్యం చెప్పేటంత పరిజ్ఞానం నాకు లేదు. 

శ్రీ త్యాగరాజ స్వామి వాగ్గేయకారునిగా విశ్వరూపం చూపించిన అద్భుత గీతాలు ఈ పంచరత్న కృతులు. 

తెలుగునాట ప్రతి ఇంటా ,  ప్రతి నోటా ఈ పంచరత్న కృతులు పలికే / చేరువ అయ్యే  రోజు రావాలని నా అభిమతం. 

తొలిగా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన 'సాధించెనే' గీతం.  (రాగం - ఆరభి, తాళం - ఆది) . 

ఆరభి, సామ, శుద్ధ సావేరి రాగాలు అప్ప చెల్లెళ్లు. అప్ప గారైన  ఆరభి అతి మధురమైన రాగం. ఈ మూడు రాగాలు అర్ధనారీశ్వర స్వరూపమైన శంకరాభరణం రాగం ముద్దు బిడ్డలు. 

కీర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 

పల్లవి : సాధించెనే ఓ మనసా !

అనుపల్లవి :  బోధించిన సన్మార్గవచనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా

(1) దేవకీ వసుదేవుల నేగించినటు - (సాధించెనే)


(2) రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు -
     (సాధించెనే)

(3) గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు
     (సాధించెనే)

(4) సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు                 
      సకలాధారుడు - (సాధించెనే)

(5) వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే
      పరమాత్ముడదియు గాక యశోద తనయుడంచు
      ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి
      (సాధించెనే)

(6)  పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ
      మనఘుడీ కలి బాధలు దీర్చు వాడనుచునే   
      హృదంబుజమున జూచు చుండగ      (సాధించెనే)

(7)  హరే! రామచంద్ర! రఘుకులేశ ! మృదు సుభాష! శేష     
       శయన ! పర నారీ సోదరాజ ! (సోదర + అజ) 
       విరాజ తురగరాజ !రాజనుత ! 
       నిరామయాపఘన ! సరసీరుహ దళాక్ష! యనుచు 
       వేడుకొన్ననన్ను తా బ్రోవకను (సాధించెనే)

(8)  శ్రీ వేంకటేశ! సుప్రకాశ! సర్వోన్నత !సజ్జన మానస     
      నికేతన ! కనకాంబరధర ! లసన్మకుట కుండల విరాజిత! 
      హరే ! యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు 
      మానవేంద్రుడైన రామచంద్రుడు (సాధించెనే)

అనుబంధము : సమయానికి తగు మాటలాడెనే
      సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ గొనెనే
      అలుగ వద్దననే విముఖులతో జేరబోకుమనెనే
      వెత గలిగిన తాళుకొమ్మనెనే దమశమాది 
      సుఖదాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు
      చెంత రాకనే 

       సాధించెనే  ఓ మనసా సాధించెనే

కొన్ని విశేషాలు : 

మహాగాయకులు ఈ కీర్తన  పాడడంలో కొంత వైవిధ్యము కనబడుతున్నది . వారి వారి సంప్రదాయం అనుసరించి  ప్రతి చరణం / చిట్ట స్వరం  ముగిసిన తదుపరి 'సమయానికి తగు మాటలాడెనే' అని గానీ 'సాధించెనే' అని గానీ పాడడం జరుగుతున్నది.  రెండు పద్ధతులు కూడా ఆమోదయోగ్యమూ అనుసరణీయము అని పెద్దలు నిర్ణయించారు . 

త్యాగరాజ స్వామి ప్రతి కీర్తనలోనూ చరణాలతో పల్లవికి అనుబంధం, భావ సమన్వయం ఎంతో  అందంగా కుదరడం వారి ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు.  

దేవకీ వసుదేవుల నేగించినటు - సాధించెనే 

దేవకీ వసుదేవులు బాల్యంలో కృష్ణుడి లీలలను చూడలేక పోయినందుకు దు:ఖితులైనారు. అదే తీరుగా  నన్ను కూడా సాధిస్తున్నాడు

సొక్కజేయుచును - పరవశింపజేస్తూ 

నిరామయాపఘన! - ఏ దోషమూ అనారోగ్యము లేని శరీరము కలవాడా. 

కీర్తన సంస్కృత , తెలుగు  పడికట్టు పదాల మేలు కలయికగా సాగుతూ అద్భుత శబ్ద సౌందర్యం తో ఆకట్టుకుంటుంది. ప్రతి పదంలో  స్వామి వారి భక్తి అణువణువునా ద్యోతక మవుతుంది. 

అనుబంధంలో  అలుగ వద్దననే విముఖులతో జేరబోకుమనెనే
వెత గలిగిన తాళుకొమ్మనెనే అని చెప్పడం ఆత్మీయంగా అనిపిస్తుంది. 

శ్రీ త్యాగరాజస్వామి పంచరత్న కృతుల ఆలాపనలో సంగీత స్వయంభువు మంగళం పల్లి బాలమురళీకృష్ణ గారిది benchmark. 






శ్రీ సద్గురు త్యాగరాజ స్వామినే నమ:



Wednesday, March 18, 2020

మీరా లాగా పిలిస్తే భగవానుడు ఎందుకు రాడు - మియా కి మల్హర్ - కొన్ని సంగీత కబుర్లు.


Meera Bai is known as a mystic poet, staunch devotee of Lord Krishna of 15th century. So many anecdotes are available on her. Where fact ends and fiction takes over is difficult to say. She is an enigma.


మీరా బాయి జీవితం మనసా వాచా కర్మణా కృష్ణునికే అంకితం. కృష్ణుడే ఆమె సర్వస్వము . మీరా కృష్ణుడు వేరు కాదు. నీవే తప్ప ఇత: పరంబెఱుంగఁ  అని సర్వకాల సర్వావస్థలందూ భావన చేస్తుంది ఆమె. 


Meera Bhajans are a fountainhead of Bhakti. లతా మంగేష్కర్ గానం చేసిన మీరా భజనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 

అందులో  మియా మల్హర్ లేదా miyan ki malhar అనే హిందూస్తానీ రాగం లో స్వర పరచ బడిన ఒక గీతం. 

మ్హారా రే గిరిధర్ గోపాల్  దూస్ రా నా కోయా - పాట బాణీ , లతాజీ high pitch లో పాడిన తీరు అద్భుతం. 

మియా మల్హర్ రాగం లో బోలె రే పపిహరా (గుడ్డీ చిత్రం- 1971- వసంత్ దేశాయి సంగీతం- వాణీ జయరాం గానం )  - A Golden classic song. this song is forever. 

ఈ పాట వల్ల మియా మల్హర్ రాగం ఎంతో ప్రాచుర్యం పొందింది.  1978 లో వచ్చిన మీరా బాయి చిత్రంలో వాణీ జయరాం గారు దాదాపు అన్ని పాటలు పాడారు. సంగీతం పండిట్ రవి శంకర్ జీ. 

లతాజీ గారు -వాణీ జయరాం గారు హిందీ సినిమాలలో పాడడాన్ని ఇష్టపడలేదని అప్పట్లో అనుకునేవారు. 

తెలుగు లో కూడా పెండ్యాల గారు ఒక పాట ను మియా మల్హర్   రాగంలో స్వర పరచినట్టు తెలుస్తుంది. 

అలకలు తీరిన కన్నులు ఏమనె  ప్రియా (మా నాన్న నిర్దోషి - సుశీల గారు - బాలు - పెండ్యాల- 1970) - హిందూ స్థాని రాగాన్ని అంత  అందంగా ఒక యుగళ గీతం కోసం మలచడం మహా సంగీత దర్శకులు పెండ్యాల గారికే చెల్లింది. 

కర్ణాటక సంగీతం లో సాహిత్యానికి, సంగీతానికి రెంటికీ పెద్ద పీట ఉంటుంది. కచేరి format అరిటాకు వేసి వడ్డించిన షడ్రసోపేతమైన విందులా ఉంటుంది.  కానీ ఒక్కో సారి ఎవరో తరుముతున్నట్లు వేగం గా పాడడం అవసరమా అనిపిస్తుంది. 

హిందూ స్థానీ సంగీతం లో శృతి కి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఒక చోట నిలబెట్టి పాడుతూ మెల్లిగా ధారలా జారుతుంది. వారికి రాగం ప్రధానం. సాహిత్యానికి రెండో స్థానమే. 

ద్రాక్ష పాకం నారికేళ పాకం పోలిక చెప్పవచ్చు. 

कौन कहते है भगवन आते नहीं , तुम मीरा के जैसे बुलाते नहीं అని ఇటీవలి కాలం లో విన్న ఒక పాట బాగుంటుంది.  

అందమైన,  నిజమైతే బాగుండు అనిపించే కల్పన , నిజాల చుట్టూ అల్లుకున్న అందమైన కల్పనలు ఇవి కూడా నిజాలే. నిజం కల్పనల మధ్య సరిహద్దు ఎప్పుడు చెరిగిపోయిందో ఇలాంటి పాటలు వింటే తెలియదు. 











Tuesday, March 3, 2020

వేగమే నను బ్రోచేవారెవరురా - ఎందుకే నీకింత తొందరా

ఖమాస్  రాగం పై కొన్ని సంగీత కబుర్లు :

కర్ణాటక సంగీతం లో అధికంగా జన్య రాగాలు కలిగిన / అతి పురాతన మైన  పెద్ద ముత్తయిదువ  రాగాలు.

1) కల్యాణి 2) శంకరాభరణం 3) హరి కాంభోజి 4) మాయా మాళవ గౌళ 5) ఖరహర ప్రియ 6) తోడి 7) భైరవి .( భైరవి రాగం అతి సనాతనమైన రాగం.) 

అందులో హరికాంభోజి జన్యమైన  ఖమాస్  రాగమంటే తెలుగు వారికి  ప్రీతి  ఎక్కువే. ఆర్తి ,ఆర్ద్రత , భక్తి భావాలు ఈ రాగం లో ధ్వనిస్తాయి. 

ఈ రాగం లో మిక్కిలి ప్రసిద్ధమైన " బ్రోచేవారెవరు రా" (మైసూరు వాసుదేవాచార్య కృతి) శంకరాభరణం సినిమా ద్వారా బహుళ ప్రజాదరణ పొందింది. 

ఖమాస్ రాగం లో నాకు బాగా ఇష్టమైన రెండు గీతాలు. 

(1) జి. బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన అన్నమయ్య గీతం

 'మెరుగు వంటిది అలమేలు మంగ'  

(పాట  గానం, సంగీతం, ధ్వని ముద్రణ మొదటి శ్రేణి లో ఉన్నాయి ఈ పాట లో)

(2)" పల్లవియే సరణం " (SP బాలు - S జానకి - ఇళయరాజా)

The trio SP బాలు - S జానకి - ఇళయరాజా weave magic in this beautiful song. 

సంగీత దృశ్య కావ్యం  'మల్లీశ్వరి' లోని "ఎందుకే నీకింత తొందర' పాట ను స్మరించకుండా ఖమాస్  రాగం పై కబుర్లు పూర్తి కావు. 

( రాజేశ్వర రావు - భానుమతి - దేవులపల్లి గారులు )

The genius of Rajeswara rao and Bhanumathi garu in bringing out the nuances and subtle variations of khamas ragam is evident in the song. 

Immortal lines from the song.

"బాధ లన్నీ పాత గాధలై  పోవునే 
వంతలన్నీ వెలుగు పుంతలో మాయునే "

ఒకవైపు   వేగమే నను బ్రోచేవారెవరురా .... 

మరోవైపు ఎందుకే నీకింత  తొందరా 

అని వింటూ ఉంటే నవ్వు వస్తుంది.